భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/ కొత్తగూడెం సింగరేణి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రానేవచ్చాయి. నిన్న మొన్నటి వరకు కోర్టులో కేసు ఉండడంతో ఎన్నికలకు బ్రేక్ పడుతుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ.. ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని తాజాగా హైకోర్టు తీర్పునివ్వడంతో సింగరేణి ఎన్నికలు జరిపేందుకు రీజినల్ లేబర్ కమిషన్ (ఆర్ఎల్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే కార్మిక సంఘాల నాయకులు ప్రచారంలో ఉండగా.. తాజాగా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలో ఉన్న ఏరియాల్లో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నల్లనేలపై గులాబీ జెండా ఎగురవేసిన విషయం విదితమే.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలపై స్పష్టత రావడంతో కార్మిక సంఘాల నాయకులు పోటీకి సై అంటున్నారు. గుర్తింపు సంఘంగా విజయం సాధించేందుకు ఆయా సంఘాల నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 1998లో సింగరేణిలో ఎన్నికలు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. 1998 నుంచి వరుసగా రెండుసార్లు ఏఐటీయూసీ విజయం సాధించగా.. 2003లో ఐఎన్టీయూసీ గెలుపొందింది. 2007లో మరోసారి ఏఐటీయూసీ విజయం సాధించగా.. 2012, 2017 ఎన్నికల్లో టీబీజీకేఎస్ రెండుసార్లు విజయదుందుభి మోగించింది. తాజా ఎన్నికల్లోనూ మరోసారి గెలుపు కోసం టీబీజీకేఎస్ పోటీ పడుతోంది. 11 ఏరియాల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి.
హైకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో రీజినల్ లేబర్ కమిషన్ ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 11 కౌంటింగ్ సెంటర్లను అందుబాటులో ఉంచింది. 13 కార్మిక సంఘాలు పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఈ నెల 27న ఎన్నికలు జరుగనున్నాయి.
కార్మికులే ఓటర్లుగా ఉన్న కార్మిక ప్రాంతాల్లో వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మొత్తం 11 ఏరియాల్లో 39,809 మంది ఓటర్లు ఉన్నట్లు రీజినల్ లేబర్ కమిషన్ గుర్తించింది. కార్పొరేట్లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లెందులో 613 మంది, మణుగూరులో 2,452, రామగుండం-1లో 5,404, రామగుండం-2లో 3,557, రామగుండం-3లో 3,884, భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లిలో 998, మందమర్రిలో 4,838, శ్రీరాంపూర్లో 9,149, నైనీలో నలుగురు ఓటర్లు ఉన్నారు.