రెండోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ
రాత్రికి 66 అడుగులు చేరుకునే అవకాశం
అప్రమత్తమైన కలెక్టర్ అనుదీప్.. అధికారులతో కాన్ఫరెన్స్
పునరావాస కేంద్రాలకు ముంపువాసులు
పట్టణంలోనే ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తున్న మంత్రి అజయ్
గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నది. జల సవ్వడి కనువిందు చేస్తున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జలకళ సంతరించుకున్నది. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నది. సోమవారం రాత్రి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం గోదారి నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో మరోసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 63 అడుగుల నుంచి 66 అడుగులకు ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. గోదారికి 1976 నుంచి ఇప్పటివరకు 18 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఇప్పటి వరకు గోదావరి ప్రవాహం ఐదుసార్లు 60 అడుగులకు చేరగా.. తాజాగా గురువారం ఆరోసారి 60 అడుగులు దాటే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఖమ్మం, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాచలం, జూలై 13: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది. బుధవారం మధ్యాహ్నం 53 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ అనుదీప్ ఈసీజన్లో రెండోసారి మూడోప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 7 గంటలకు 54.30 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతున్నది. రాత్రి 63 అడుగుల నుంచి 66 అడుగులకు ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి దాదాపు 13.90 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి చేరుతున్నది. ఈ నేపథ్యంలో కలెక్టర్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పట్టణంలోని కొత్తకాలనీ, సుభాశ్నగర్ కాలనీ, అన్నదాన సత్రం, రామాలయం పడమర ప్రాంతంలో ఇప్పటికే వరద చుట్టుమట్టడంతో ముంపు కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రామాలయం సమీపంలోని అన్నప్రసాద కేంద్రం, విస్తా కాంప్లెక్స్, చప్టా దిగువ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. సమీప ప్రాంతాల్లోని బొమ్మల దుకాణాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. భద్రాచలంలో తొమ్మిది పునరావాస కేంద్రాలు, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్, సారపాకలో ఒక్కో పునరావాస కేంద్రం ఏర్పాటైంది.
పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, పర్ణశాల, కూనవరం రోడ్డులో కొల్లుగూడెం వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో భద్రాచలానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భద్రాచలంలోనే బస చేసి ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. బుధవారం లోతట్టు ప్రాంతాలైన సుభాశ్నగర్, కొత్తకాలనీ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటుందని, ప్రజలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్ భద్రాచలంలోనే మకాం వేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముంపు మండలాల సెక్టోరియల్ అధికారులు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాలు, ఐటీడీఏ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయించారు. గోదావరి సమీప కాలనీల్లో భారీ మోటార్లను ఏర్పాటు చేసి వరదను తిరిగి నదిలోకి మళ్లిస్తున్నారు.
ఏజెన్సీ జల దిగ్బంధం..
వరదల కారణంగా భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గాలన్నీ జలదిగ్బంధమయ్యాయి. నెల్లిపాక ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండడంతో చింతూరు, కూనవరం, వీఆర్ పురం, చట్టి ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. బూర్గంపహాడ్ మండలం ఇరవెండి- అశ్వాపురం రహదారి, సారపాక-నాగినేనిప్రోలు రెడ్డిపాలెం రహదారులపైకి వరద చేరడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. వాగులు, వంకల వద్ద పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారులు, సెక్టోరియల్ అధికారులు సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా జల దిగ్బంధంలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారికి వసతి కల్పిస్తున్నారు. నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. వైర్లెస్ సెట్ల ద్వారా ముంపు గ్రామాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ముంపు గ్రామాలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి భద్రాచలంలో హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంది. ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు అందుబాటులో ఉన్నారు. వైద్యసిబ్బంది ఇప్పటికే గర్భిణుల సమాచారాన్ని సేకరించారు. కొందరిని ఇప్పటికే సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు సిఫార్సు చేశారు.
ఐదుసార్లు 60 అడుగులు దాటిన ప్రవాహం..
భద్రాచలంలోని గోదావరి ఇప్పటివరకు ఐదుసార్లు 60 అడుగులు దాటి ప్రవహిచింది. 1976 జూన్ 22న 63.9 అడుగులు, 1983 ఆగస్టు 14న 63.5, 1990 ఆగస్టు 24న 70.8, 2006 ఆగస్టు 6న 66.9, 2013 ఆగస్టు 3న 61.5 అడుగులు ప్రవహించింది. 1976 నుంచి ఇప్పటివరకు 18 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. తాజాగా ఈనెల 14న (గురువారం) ఆరోసారి గోదావరి ప్రవాహం 60 అడుగులు దాటే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క జూలై నెలలోనే రెండు సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే ప్రప్రథమమంటున్నాయి.
కంట్రోల్ రూం నంబర్లు
కలెక్టరేట్:
ల్యాండ్లైన్- 08744-241950
వాట్సాప్- 9392929743
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం
ల్యాండ్లైన్- 08743 – 232444,
వాట్సాప్- 6302485393
ఆర్డీవో కార్యాలయం
9392919750
ఐటీడీఏ కార్యాలయం
08743-232244