కారేపల్లి, మే 11 : ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీలలో విధి నిర్వహణలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్(టీపీఎస్ఏ) ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తిలక్ కిషోర్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శుల బదిలీలు, డిప్యూటేషన్ లో పని చేస్తున్న కార్యదర్శులకు అదే గ్రామ పంచాయతీలలో రెగ్యులర్ బదిలీలు చేయాలని, గతంలో జరిగిన బదిలీలను పునర్విమర్శించి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన సవరణలు చేయాలన్నారు.
భవిష్యత్లో బదిలీలు చేపట్టేటప్పుడు మానవీయ దృక్పథంతో కుటుంబ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని, జేపీఎస్ నుండి గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించబడిన వారికి సర్వీస్ రూల్స్ ప్రకారం వారి ప్రొబెషనరీ పీరియడ్ను ఒక ఏడాదిగా గుర్తిస్తూ వెంటనే అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రంలో పేర్కొంటూ కలెక్టర్కు అందజేసినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో టీపీఎస్ఏ జిల్లా నాయకులు శ్రీను, హరి, రాజేష్, రఘు, రామచంద్ర ఉన్నారు.