భద్రాచలం, ఫిబ్రవరి 15 : వర్షాకాలంలో పోలవరం బ్యాక్ వాటర్తో భద్రాచలం పట్టణానికి ముప్పు పొంచి ఉన్నదని, దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉన్నదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022, జూలై 17న 70 అడుగుల మేర వరద ప్రవాహం నమోదైందని, దీంతో పట్టణంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయని గుర్తు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కరకట్ట నిర్మించారన్నారు.
మిగిలిన అర కిలోమీటర్ కరకట్ట నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.39 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. అయితే ఆ టెండర్లను రద్దు చేయకుండా కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అలాగే నాలుగు రాష్ర్టాల రోగులకు వైద్య సేవలు అందిస్తున్న భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల కొరత ఉన్నదని, వెంటనే ఆయా పోస్టులను భర్తీ చేయాలని కోరారు.