పెషావర్, ఆగస్టు 2 : గత కొద్ది నెలలుగా హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న పాకిస్థాన్ వాయువ్య ప్రాంతం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఆత్మాహుతి పేలుడు సంభవించింది. ఆదివారం స్వాత్ జిల్లాలోని ఓ పట్టణంలో వందలాది మంది చేపట్టిన శాంతియుత ర్యాలీలో పోలీస్ అధికారులు, సిబ్బంది లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయారని, ఒక పోలీస్ అధికారి సహా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వెలువడ్డాయి.
బాధితులను సహాయక బృందాలు పట్టణంలోని వివిధ దవాఖానాలకు తరలించినట్టు తెలిసింది. స్వాత్ జిల్లాలో నెలకొన్న అశాంతి, అభద్రతపై అక్కడి గిరిజన కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతియుత ర్యాలీ నిర్వహించింది. తమ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొనేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వందలాది మంది స్థానికులు ర్యాలీ నిర్వహించారు.