భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక విద్యపై కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తోంది. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు పన్నాగం పన్నుతోంది. ఇందుకోసం పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా యూనివర్సిటీలో విలీనం చేసేందుకు తెరలేపింది. ఇందులో భాగంగా జీవో నంబర్ 97ను తీసుకొచ్చింది. అయితే, ప్రభుత్వ కుట్రలను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నిర్ణయాలు, జీవోలన్నీ పాలిటెక్నిక్ విద్యపై పిడుగు వేయడం లాంటివేనని ఆయా సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎనిమిది రోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల వద్ద నిరసనలను కొనసాగిస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో బీఆర్ఎస్, దాని అనుబంధ విద్యార్థి, యువజన సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రభుత్వ మెడలు వంచేందుకు సిద్ధమయ్యాయి.
జాతీయ విద్యావిధానం పేరుతో పాలిటెక్నిక్ విద్య నిర్వీర్యానికి సర్కారు తెరలేపింది. ఈ ఏడాది జూన్ 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యంగ్ ఇండియా యూనివర్సిటీని హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. ఈ యూనివర్సిటీ ఒక ప్రైవేటు సంస్థ ఆధీనంలో నడుస్తుంది. దీనిలో పాలిటెక్నిక్ను విలీనం చేయడం కోసం జీవో 97ను తీసుకొచ్చారు. ‘శక్తి’ పేరుతో ఉన్న సంస్థ ద్వారా పాలిటెక్నిక్ విద్యను నడిపించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది.
ఇప్పటికే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. గతంలో పాలిటెక్నిక్ విద్యను పూర్తిచేసిన విద్యార్థులకు ‘ఈ-సెట్’ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్ చదివే అవకాశం ఉండేది. ఇప్పుడు జీవో 97 అమలైతే పాలిటెక్నిక్ విద్య అక్కడికే పరిమితం కానుంది. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యకు వెళ్లాలంటే మళ్లీ ఇంటర్ ద్వారానే ఎప్సెట్ పరీక్ష రాసి బీటెక్ చేయాల్సిందే. ఈ విధానంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
భద్రాద్రి జిల్లాలో ఉన్న ఐదు పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు. కొత్తగూడెం, మణుగూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా.. పాల్వంచ, కొత్తగూడెంలలో మూడు ప్రైవేటు కాలేజీలు కూడా ఉన్నాయి.

అయితే, ఈ జాతీయ విద్యావిధానంతో జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు రాష్ట్రంలోని కళాశాలల్లో పాలిటెక్నిక్ చదివే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడే ప్రమాదం ఉందని సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పేందుకు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం నుంచి బీఆర్ఎస్ సహా దాని అనుబంధ విద్యార్థి, యువజన సంఘాలు కూడా నిరసనలకు దిగుతున్నాయి.
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేసే జీవో 97ను వెంటనే రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి యుజవన సంఘాల నేతలు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు శుక్రవారం కూడా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులను కలిసి బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మాట్లాడారు. భద్రాచలంలో జరిగిన సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడారు. కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక విద్యను నిర్వీర్యం చేస్తోంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో నేరుగా సెకండ్ ఇయర్లో చేరాల్సిన పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంది. ప్రైవేటు సంస్థల కోసం, అవి ఇచ్చే కమీషన్ల కోసం ఇంత దుర్మార్గానికి ఒడిగట్టింది. సర్కారు మెడలు వంచేందుకు ధర్నాలే కాదు నిరాహార దీక్షలు కూడా చేస్తాం.
-వరక అజిత్, ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి
సాంకేతిక విద్యలో స్కిల్స్ నేర్చుకునేది పాలిటెక్నిక్ కోర్సులోనే. అలాంటి కోర్సును నిర్వీర్యం చేయడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే ఎంతో అరాచక పాలన చేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల ఉసురు తగులుతుంది. ధర్నాలు ఆపబోం. విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేయాలని ప్రభుత్వం భావిస్తే.. ప్రతిఘటన తప్పదు.
-మందా నాగకృష్ణ, ఎస్ఎఫ్ఐ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు