భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్తో ముంపునకు గురయ్యే గ్రామాలపై సర్వే శాస్త్రీయంగా ఉండాలని, అడ్డగోలుగా సర్వే చేస్తే ఊర్కునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం అథారిటీ బృందం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఈ నెల 3, 4వ తేదీల్లో పర్యటించనున్న నేపథ్యంలో బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల లెక్క కచ్చితంగా ఉండాలన్నారు.
కాకి లెక్కలు వేసి.. ముంపు లేదు.. అంత వాటర్ రాదు.. అని అడ్డగోలు సర్వేలు చేస్తే ఊర్కునేది లేదన్నారు. 1986, 1990, 2024 సంవత్సరాల్లో వరదలు చాలా ఉధృతంగా వచ్చాయని, ఈ సమయంలో 25 లక్షల క్యూసెక్కుల నుంచి 35 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని తెలిపారు. అదే నీటికి అడ్డుకట్ట వేసి ఆపడం వల్ల బ్యాక్ వాటర్ ద్వారా భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, దీంతో ముర్రేడు, కిన్నెరసాని వాగుల పక్కనే ఉన్న గ్రామాలు ముంపు భారిన పడతాయని తెలిపారు. వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పోలవరం అథారిటీ బృందం కచ్చితమైన అంచనాలు వేసి, ప్రజల ముందు నివేదిక ఉంచాలని సూచించారు. బృందం సభ్యులకు బీఆర్ఎస్ పక్షాన తమ డిమాండ్లు వినిపిస్తామని, ముంపు ప్రాంత ప్రజల పక్షాన నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.
ముంపు ప్రాంతాలకు నీరు వెళ్లకుండా భద్రాచలం వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు వెచ్చించి రక్షణ చర్యలు కల్పించాలన్నారు. ఆంధ్రాలో అక్కడి నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం కన్నా కొత్త చట్టం ప్రకారం ఇక్కడి నిర్వాసితులకు పరిహారం ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు వారి వెంటే ఉంటామని, వారికోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని రేగా స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమ నాయకులు దిండిగాల రాజేందర్, మంతపురి రాజుగౌడ్, మల్లెల రవిచంద్ర, హుస్సేన్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు సింధు తపస్వి, మల్లెల స్వప్న, నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, దామోదర్, అనుదీప్, అన్వర్, సంపు, జయరాం, రాజేశ్, భూపాతి శ్రీను తదితరులు పాల్గొన్నారు.