భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఉద్యమసారథి కేసీఆర్ 14 ఏళ్ల అలుపెరుగని పోరాటం, ప్రాణాలను సైతం లెక్కచేయని ఉద్యమం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గుర్తుచేశారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల సుదీర్ఘ పోరాటంతోనే స్వరాష్ట్ర కల సాకారమైందని జ్ఞప్తికి తెచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగవారం కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలోనూ, మణుగూరులోనూ వేడుకలు నిర్వహించారు.
ఆయా చోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రేగా కాంతారావు మాట్లాడారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపర్చి, సుదీర్ఘకాలం కొట్లాడి, ఢిల్లీ పెద్దల మెడలు వంచడం వల్లనే స్వరాష్ట్ర కాంక్ష సాకారమైందని గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాల వల్లనే నేడు స్వరాష్ట్రంలో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామని అన్నారు. అయితే, సాధించిన తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. అంతటి తెలంగాణను నేటి కాంగ్రెస్ పాలకులు మరింత వెనక్కు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. నేతలందరూ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అమరవీరుల స్తూపాలకు నివాళులర్పించారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం, మణుగూరులో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెంలలో మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, మధిరలో ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, భద్రాచలంలో బీఆర్ఎస్ నేతలు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్ పాల్గొన్నారు.