భద్రాద్రిలో శుక్రవారం రామయ్య పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కనుల పండువగా జరిగింది. ఈ అపురూప ఘట్టానికి మిథిలా ప్రాంగణం వేదికైంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు అర్చకులు, ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను పల్లకీలో మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. భక్తుల జయజయ ధ్వానాలు, రుత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు గోదావరితోపాటు నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాలతో విశ్వక్సేన పూజ చేశారు. 12 మంది రుత్వికులు సరిగ్గా 12:30 గంటలకు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేశారు
ఖమ్మం, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ)/ భద్రాచలం: రఘు వంశ తేజుడు రాజాధిరాజు శ్రీరామచంద్రస్వామి సీతాలక్ష్మణ ఆంజనేయుడి సమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు.. ఈ అపురూప ఘట్టానికి భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ప్రాంగణం వేదికైంది. శుక్రవారం అట్టహాసంగా రామయ్య పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు అర్చకులు, ఆలయ అధికారులు స్వామివార్ల మూర్తులను పల్లకీలో మిథిలా ప్రాంగణానికి తీసుకొచ్చారు. భక్తుల జయజయ ధ్వానాలు, రుత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు గోదావరితో పాటు నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాలతో విశ్వక్సేన పూజ చేశారు.
12 మంది రుత్వికులు సరిగ్గా 12.30 గంటలకు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేశారు. 24 శ్లోకాలు చదివి రాముడి చెంత రాజదండం, రాజముద్రిక, ఖడ్గం, చామరం, ఛత్రాన్ని ఉంచారు. వచ్చే ఏడాదికల్లా స్వామివారికి బంగారు ఖడ్గాన్ని అలంకరించేందుకు భక్తులు సహకరించాలని కోరారు. ఒక్కో ఆభరణానికి ఉన్న విశిష్టతను వివరించారు. 12.40 గంటలకు రామయ్యకు కిరీట ధారణ చేశారు. రుత్వికులు నదీ జలాలను భక్తులపై చల్లారు. త్రిదండి దేవనాథ రామానుజ స్వామి, అహోబిల మఠ రామానుజస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణ, దేవస్థాన అధర్వణ వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యుల ప్రత్యక్ష వ్యాఖ్యానంతో వేడుక కొనసాగింది. సీతమ్మ జన్మించిన శోభకృత్ నామ సంవత్సరంలోనే సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం జరగడంతో ఎంతో విశేషం.
దశాబ్దాల నుంచి చివరి సారి జరిగిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం రామాలయ ప్రాంగణంలో నిర్వహించగా ఈ సారి మిథిలా ప్రాంగణంలో జరిగింది. వేడుకకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఆమెకు కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు స్వాగతం పలికారు. వేడుకలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఏఎస్పీ పంకజ్, ఆర్డీవో రత్నకల్యాణి, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. భద్రాచలంలో స్వామివారి పట్టాభిషేకం ముగిసిన తరువాత గవర్నర్ తమిళిసై దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామయ్యను దర్శించుకోవాల్సి ఉంది. కానీ అకాల వర్షం కారణంగా ఆమె పర్యటన రద్దు అయింది.
భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో కనుల పండువగా శ్రీరాముని పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగిందని, భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శుక్రవారం ఆమె పట్టాభిషేక వేడుక అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించేలా ఆశీర్వదించాలని స్వామివారిని వేడుకున్నట్లు వెల్లడించారు.