భద్రాచలం, మార్చి 25 : హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం డోలోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాలతో ప్రత్యేక స్నపనం చేపట్టారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని పురస్కరించుకొని స్వామివారి కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీకి సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. తొలుత విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యాహవాచన చేసి కలశవాహన నిర్వహించారు. అనంతరం పంచామృతాలు, 9 రకాల పళ్ల రసాలు, సాలగ్రామహారం, తులసీ మాలలు, హరిద్రాచూర్ణంతో స్వామివారికి అభిషేకం చేసి.. కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారతులు, అర్ఘ్య, పాద్య ఆచమనం సమర్పించి ఫలాలను నివేదన చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అందంగా అలంకరించిన బంగరు ఊయలలో స్వామివారిని ఆశీనులను చేసి డోలోత్సవం జరిపారు. స్వామివారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. దేవస్థానం ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహాదాసు కీర్తనలను ఆలపించారు.
హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి వసంతోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. తొలుత అంతరాలయంలోని మూలవరులకు, లక్ష్మీతాయారమ్మ వారికి, ఆంజనేయస్వామికి వసంతాన్ని చల్లి.. తర్వాత భక్తులపై చిలకరించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ జరిపారు.
శ్రీరామ నవమి రోజు రామయ్య కల్యాణంలో వినియోగించే తలంబ్రాల తయారీకి సోమవారం సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులను మిథిలా ప్రాంగణం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి రోలు, రోకళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మి, సరస్వతులను ఆవాహన చేసి రోళ్లు, రోకళ్లకు కంకణధారణ గావించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణంలో పాల్గొనే ఆచార్య, బ్రహ్మరుత్వికుల రోళ్లలో పసుపు కొమ్ములు వేసి దంచగా.. తర్వాత వారి భార్యలు రోళ్లలో పసుపు కొమ్ములు వేసి దంచారు. ఆ తర్వాత పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్కా గులాల్, అత్తరు, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను కలిపే వేడుకలను నయనానందకరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలను తీసుకొచ్చిన భక్త బృందాలు, భక్తులతో భద్రాద్రి పట్టణం భక్తజన సంద్రంగా మారింది. కాగా.. ఎంతో విశిష్టత ఉన్న భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలను భక్తులు తమ ఇళ్లల్లో జరిగే వివాహా తలంబ్రాలతో కలిపి వధూవరుల శిరస్సుపై పోయిస్తారు.