జిల్లాలో తెరిపివ్వకుండా రోజులతరబడి భారీ వర్షాలు కురిశాయి. వానకాలం సీజన్లో రైతులు పోసిన వరి నార్లు.. కొన్నిచోట్ల మొలక, మొక్క దశలోఉన్న అపరాల పంటల్లో వర్షపు నీరు నిలిచింది. ఆ నీటితో పంటలకు ప్రమాదమని, ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే మొక్కలు కుళ్లిపోతాయని, వెంటనే వర్షపు నీటిని తొలగించి తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కలు కుళ్లిపోయి.. ఎర్రబారి.. గిడసబారకుండా ఉండాలంటే యాజమాన్య పద్ధతులు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి ప్రతికూల, వాతావరణ పరిస్థితుల్లో వర్షాధార పంటలైన మొక్కజొన్న, జొన్న, కంది, పత్తి, వేరుశనగ, సోయా చిక్కుడు, పెసర, మినుముతోపాటు వరి, పసుపు, చెరుకు, మిరప, ఉద్యాన పంటల్లో కొన్ని జాగ్రత్తలు పాటించినైట్లెతే పంటలు నష్టపోకుండా కాపాడుకోవచ్చు. వర్షపు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల మొక్కల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోయే ఆస్కారం ఉంది. అంతేకాక చీడపీడలు, తెగుళ్లు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకోసం జిల్లా రైతాంగం తగిన జాగ్రత్తలు పాటించాలి.. లేదంటే పంటలకు తెగుళ్లు సోకి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేస్తున్నారు.
పత్తి..
పత్తి వేసిన నల్లరేగడి నేలల్లో నీరు ఎక్కువ రోజులు నిలవడం, నేలలో అధిక మొత్తంలో తేమ ఉండడం వల్ల పత్తిలో ప్యూజేరియం, ఫైటోప్తారా వడల తెగులు వచ్చే అవకాశం ఉంది. మొక్కలు అక్కడక్కడా ఎండిపోవడం కనిపిస్తే ఎండు తెగులు అని నిర్ధారణ చేసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3.0 గ్రాములు కలుపుకొని తెగులు సోకిన మొక్క మొదళ్ల చుట్టూ నేల తడిచే విధంగా పోయాలి. తేమ వల్ల పంట పోషకాలను నేల నుంచి త్వరగా సంగ్రహించలేవు. వర్షాలు పూర్తిగా తగ్గాక పత్తి పంట త్వరగా కోలుకోవడానికి పొటాషియం నైట్రేట్(13-0-45) లేదా 2 శాతం యూరియా లేదా 19:19:19 వంటి పోషక ఎరువులను 10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. నేలలోని తేమ(పదును)ను బట్టి గొర్రు లేదా గుంటుకతో అంతర కృషి చేయాలి. తర్వాత పైపాటుగా ఎకరానికి 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలి. 20-25 రోజుల వయసున్న పత్తిలో వెడల్పు ఆకులు ఉన్న కలుపు, గడ్డి నివారణకు క్విజలోపాస్ ఈథైల్ 2 మిల్లీ లీటర్లు, పైరిథయోబాక్ సోడియం 1.25 మిల్లీ లీటర్లు నీటికి కలిపి కలుపు మొక్కలు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి.
వరి..
ముందుగా నాట్లు వేసిన వరి అధిక వర్షాలతో మునిగి ఎర్రబడి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే పొలం నుంచి వర్షపు నీటిని బయటకు పంపించాలి. నారుమడిలో అధిక వర్షాలకు జింక్ లోపం గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఇనుప ధాతు లోపం గమనిస్తే లీటరు నీటికి 2 నుంచి 5 గ్రాములు అన్నబేది, 0.5 నుంచి 1.0 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. నారు పోసుకున్న రైతులు, నారు మడులు వరద ముంపునకు గురై ఎర్రబడి నారు చనిపోతే ప్రత్యామ్నాయంగా స్వల్ప కాలిక రకాలైన ఎంటీయూ-1010, కేఎన్ఎం-118 వంటి వరి రకాలు ఎంపిక చేసుకోవాలి. ఎకరానికి 15-20 కిలోల విత్తనాన్ని పొలాన్ని బాగా దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతులైన డ్రమ్ సీడర్తో గానీ లేదా వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలి.
మొక్కజొన్న..
మొక్కజొన్న సాధారణంగా నీటి నిల్వను, అధిక తేమను తట్టుకోదు. సాధ్యమైనంత వరకు మొక్కజొన్నలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వర్షాలు వచ్చినప్పుడు కాల్వల ద్వారా నీటిని వెంటనే తీసివేయాలి. నేలలోని తేమ(పదును)ను బట్టి గొర్రు లేదా గుంటుకతో అంతర కృషి చేయాలి. దీంతో నేలలోని అధిక తేమతోపాటు కలుపును తొలగించొచ్చు. తర్వాత ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులు వేయాలి. ఈ పంట నేలలో అధిక తేమ వల్ల పోషకాలను త్వరగా గ్రహించలేదు. ఇలాంటి సందర్భాల్లో, రోజుల తరబడి వర్షం కురిసినప్పుడు పంటలో ప్రధానంగా భాస్వరం పోషకం లోపిస్తుంది. నివారణకు 10 గ్రాములు డీఏపీ లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పంటపై పిచికారీ చేయాలి.
కంది..
కంది వేసిన నేల లు అధిక తేమను తట్టుకోలేవు. వర్షాల వల్ల నేలలో అధిక తేమ చేరినప్పుడు పైపాటుగా మల్టీ కే లేదా 19:19:19 వంటి పోషక ఎరువులను 10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. వర్షాలతో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల కందిలో పైటోప్తారా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్ 2.0 గ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3.0 గ్రాములు కలిపి తెగులు సోకిన మొక్క మొదళ్ల చుట్టూ నేల తడిచే విధంగా నేలపై పోయాలి.
మిర్చి..
మిరప నారు దశలో ఉంది. నారు మడిలో నీరు నిల్వ ఉండకుండా తీసివేయాలి. అధిక వర్షాలతో నేలలో అధిక తేమ చేరడం వల్ల ఎండు, నారుకుళ్లు తెగులు సోకే అవకాశం ఉంది. నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్ 2.0 గ్రాములు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్, 3.0 గ్రాములు కలిపి తెగులు సోకిన మొక్క మొదళ్ల చుట్టూ నేల తడిచే విధంగా నేలపై పోయాలి. నారు మొక్కలు త్వరగా కోలుకునేందుకు పొటాషియం నైట్రేట్ (13-0-45) లేదా 2 శాతం యూరియా లేదా 19:19:19 లేదా 28-28-0 లేదా సూక్ష్మ పోషకాలను 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకులు పూర్తిగా తడిచే విధంగా పంటపై పిచికారీ చేయాలి.
పంటలను కాపాడుకోవాలి
వానకాలంలో అధిక వర్షాలకు పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉంది. రైతులు సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. వరి నారులో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పొలంలో ఎక్కువ నీరు ఉంటే మొక్కలు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. వాటిని గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలు పాటించండి.
– లక్ష్మీనారాయణమ్మ, కేవీకే కోఆర్డినేటర్, కొత్తగూడెం