ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు మండలాల్లో భారీ, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వడగళ్లు కూడా కురిశాయి. పలు చోట్ల ఈదురుగాలులు వీచాయి. మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. పలు మండలాల్లో కొన్ని చెట్లు విరిగి పడ్డాయి. ఇంకొన్ని గ్రామాల్లో మొక్కజొన్న సహా పలు పంటలు నేలకొరిగాయి. మధిర పట్టణంతోపాటు మండలంలోనూ వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మడుపల్లి గ్రామంలో వేపచెట్టు విరిగి కరెంట్ స్తంభాలపై పడింది.
ఒక్కసారిగా భారీవర్షం కురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రొంపిమల్ల పరిసర గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల మట్టమైంది.
చర్ల మండలం మామిడిగూడెంలో పిడుగుపాటుకు 20 మేకలు మృతి చెందాయి. ఖమ్మం నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అధిక ఉష్ణోగ్రతలు, వేసవితాపం, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగర వాసులకు గురువారం సాయంత్రం నాటి చల్లటి వాతావరణం ఉపశమనం కలిగించింది. ఎర్రుపాలెం, చింతకాని, వైరా, కొణిజర్ల తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.