కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 22 : కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, పోలీస్ అధికారులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో భాగంగా హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గల కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో ఎస్పీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు.
పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిత్యం రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా హాట్ స్పాట్స్ను గుర్తించి గంజాయి రవాణా చేసే వ్యక్తులతోపాటు సేవించే వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
Khammam
జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి, బాధితుల ఫిర్యాదుకు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడకుండా.. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు షేక్ అబ్దుల్ రెహమాన్, ఆర్.సతీష్కుమార్, చంద్రభాను, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, అన్ని సబ్ డివిజన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.