ఖమ్మం : సీపీఐ జాతీయ నాయకుడు, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం నగరంలోని గట్టయ్య సెంటర్ లోని ఖమ్మం రోటరీ క్లబ్లో జరిగిన వేడుకలకు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ, రోటరీ క్లబ్ బాద్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు 84వ జన్మదినం పురస్కరించుకొని 84 మంది దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అందజేశారు.
అనంతరం రోటరీ క్లబ్కు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ తన తండ్రి 84వ జన్మదినం పురస్కరించుకొని పలువురు దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర పాలకసంస్థ మేయర్ పీ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, రోటరీ క్లబ్ చైర్మన్ వాసుదేవ్,సెక్రటరీ డీ సాంబశివరావు, ప్రాజెక్టు కోఆర్డినేటర్ పీ రంగారావు, ఖమ్మం ఆర్సీ అధ్యక్షులు పాలడగు నాగేశ్వరరావు, రవింద్రనాధ్, వల్లభనేని రామారావు, పులిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.