Puvvada Ajay Kumar | అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, తమకు ఓటేసిన నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నగరంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ నిరుద్యోగుల ర్యాలీలో పాల్గొన్నారు. నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఐక్యంగా ఎదురించి ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.
‘యూత్ డిక్లరేషన్’ పేరిట యువతకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలు, ప్రకటనలు చేసి నిరుద్యోగ యువతను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువత ఆశలను ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. గురుకులాల్లో సరైన వసతులు, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లను మినహాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.