గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలతోపాటు తాజాగా మరో బాధ్యతను తీసుకున్నది.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మిర్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి మిర్చి సేకరిస్తున్నది.. ప్రయోగాత్మకంగా భద్రాద్రి జిల్లాలో టేకులపల్లి, చండ్రుగొండలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రైతుల నుంచి రూ.10 కోట్ల ‘ఎర్ర బంగారాన్ని’ సేకరించింది.. వారి ఖాతాల్లో వారం రోజుల్లో సొమ్ము జమ చేస్తున్నది.. రవాణా ఖర్చు లేకుండా కల్లం వద్దనే పంటను కొనుగోలు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలన్నా రైతులకు ఇబ్బంది తప్పడం లేదు. దళారీ వ్యవస్థ, కమిషన్దారుల వలలో చిక్కి దారుణంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు కొండంత అండగా ఉన్నది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్తోపాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలోనే మిర్చి రైతులను దళారుల నుంచి కాపాడేందుకు మరో ప్రణాళిక ఏర్పాటు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. మార్కెటింగ్శాఖ అధికారులు సెర్ప్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. గన్నీ బ్యాగులు, కాంటాలను సరఫరా చేస్తున్నారు. మిర్చి రైతులకు మంచి ధరను అందించడమే లక్ష్యంగా సెర్ఫ్ తొలి ప్రయత్నంలో భాగంగా జిల్లాలో టేకులపల్లి, చండ్రుగొండ మండలాల్లో రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తున్నది. మహిళా సమాఖ్య సభ్యులతో ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మన్నెగూడెం వద్ద ఉన్న ప్లాంట్ లిపిడ్ కంపెనీ వారి సహకారంతో ఇప్పటివరకు టేకులపల్లి మండలంలో సుమారు 120మంది, చండ్రుగొండ మండలంలో 150 మంది రైతుల నుంచి రూ.10 కోట్ల బిజినెస్ చేశారు.
పంట కొనుగోలు ఇలా..
మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో క్షేత్రస్థాయిలో ముందుగా సెర్ప్ మండల ఏపీఎం, సీసీ, వీవోల ద్వారా సర్వే నిర్వహించి గ్రామాల్లోని మిర్చి రైతుల వివరాలు సేకరించారు. ప్రస్తుతం ప్లాంట్ లిపిడ్ ప్రతినిధులు ఏపీఎం, సీసీ టీం సభ్యులతో కలిసి ఆ రైతుల వద్దకు వెళ్లి పంట నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి ధరను నిర్ణయిస్తారు. రైతుకు ధర గిట్టుబాటు అయితే వెంటనే కొనుగోలు పత్రం జారీ చేసి సరిపడా గోనె బస్తాలు వెంటనే అందజేస్తారు. ఈ బస్తాల బరువు 600 గ్రాములు ఉంటుంది. తారం తీసేటప్పుడు ఈ మేరకే తీయడం గమనార్హం. గ్రామస్థాయి కొనుగోలు టీం సభ్యులు రైతుల మిర్చిని 35కిలోలకు తగ్గకుండా 50కిలోలకు మించకుండా గన్నీ బ్యాగుల్లో దగ్గరుండి నింపిస్తారు. తర్వాత ఆ బస్తాలను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి కాంటా వేయించి రసీదు ఇస్తారు. రైతుకి సంబంధించిన పంట డబ్బును వారి బ్యాంకు ఖాతాలో 3నుంచి 7 పనిదినాల్లో జమ చేస్తారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కల్లం వద్దనే పంటను కొనుగోలు చేస్తున్నాం. తారం, బస్తాలు, ధర, రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈ ఏడాది టేకులపల్లి మండలంలో ప్రస్తుతానికి 120 మంది రైతుల వద్ద నాలుగు కోట్ల బిజినెస్ చేశాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రవి, సెర్ప్ ఏపీఎం
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) రైతన్నలకు అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మిర్చి కొనుగోళ్లు చేపట్టింది. తొలిసారిగా ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు మండలాల్లో(టేకులపల్లి, చండ్రుగొండ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 270మంది రైతుల నుంచి రూ.10 కోట్ల ఎర్రబంగారాన్ని కొనుగోలు చేసింది. వారంరోజుల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట సొమ్మును జమ చేసింది కూడా. ఇటు రవాణా ఖర్చు, అటు దళారుల బెడద లేకుండా కల్లాల వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేస్తుండడంతో రైతన్నల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
– టేకులపల్లి, ఏప్రిల్ 28
రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు
మిర్చి రైతులకు మంచి ధరను అందించడమే లక్ష్యంగా సెర్ప్ సీఈవో, కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం రెండు మండలాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేశాం.. వచ్చే సీజన్కి అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తాం. వెయ్యి మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పని చేస్తున్నాం. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సునందన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగుతుంది.
– మధుసూదన్రాజు, డీఆర్డీవో
రైతులకు మంచి గిట్టుబాటు ధర
ఇల్లెందు మహిళా సమాఖ్య సభ్యులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా టేకులపల్లి మండల మహిళ సమాఖ్య సభ్యులు, సెర్ప్ సిబ్బందితో కలిసి రైతుల వద్ద మిర్చిని నేరుగా కొనుగోలు చేస్తున్నాం. రైతులకు మంచి గిట్టుబాటు ధర ఇస్తున్నాం. రైతు కల్లం వద్దనే పంటను కొనుగోలు చేసి వారంలోపే ఖాతాలో డబ్బు జమ చేస్తున్నాం. రైతుల వద్ద కొన్న మిర్చిని మన్నెగూడెంలోని ప్లాంట్ లిపిడ్ కంపెనీకి పంపిస్తాం.
– ప్రగతి, టేకులపల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సీఈవో
చాలా ఆనందంగా ఉంది
మాది ముత్యాలంపాడు క్రాస్రోడ్డు. ప్రతి సంవత్సరం మిర్చి సాగు చేస్తున్నా. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు, గాలి దుమ్ముతో ఇబ్బంది పడేవాళ్లం. తీరా పంటను అమ్ముదామంటే మార్కెట్ దగ్గరలేకపోవడంతో దళారులను ఆశ్రయించే వాళ్లం. కానీ సెర్ప్ వారు కల్లంలోనే మా పంటను కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి కమిషన్ లేకుండా వారంలోపే డబ్బులు జమ చేశారు.
– భూక్యా తావుర్యా, రైతు