కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 6 : ప్రజాసేవే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో 15 రోజులుగా నిర్వహిస్తున్న ‘డీ-మొబిలైజేషన్’ శిక్షణా కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా ఆర్మ్డ్ సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. మొబిలైజేషన్ కార్యక్రమంలో ఇన్ డోర్, ఔట్ డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్లలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. అనంతరం అక్కడ పాల్గొన్న అధికారులు, సిబ్బంది సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
డీ-మొబిలైజేషన్ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించిన అధికారులను ఎస్పీ రోహిత్రాజు అభినందించారు. ఐదు ప్లాటూన్లతో ఏర్పాటు చేసిన పరేడ్కు అడ్మిన్ ఆర్ఐ బోలెం రవి కమాండర్గా వ్యహరించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ విజయ్బాబు, ఎస్బీ సీఐ మడిపెల్లి నాగరాజు, హోంగార్డ్స్ ఆర్ఐ నర్సింహారావు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, పీఆర్వో దాములూరి శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.