కేంద్రం చేతకానితనంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం
కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం
రాష్ట్రంలో బీజీపీ అధికారంలోకి రావడం పగటి కల
కాషాయ నేతలకు దమ్ముంటే రాష్ర్టాభివృద్ధికి నిధులు తీసుకు రావాలి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
పాల్వంచ, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పగటి కల అని, బీజేపీ హయాంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, ఆయా కంపెనీలు బడా పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం అవుతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) అతిథి గృహంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారన్నారు. ఇది జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పాలమూరు, దిండి ప్రాజెక్టులు చేపడుతున్నారన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆయా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. రాష్ర్టానికి నిధులు తెప్పించలేని నాయకులకు సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత లేదన్నారు. రాజ్యాంగానికి కొన్ని సవరణలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని, బీజేపీ నాయకులు భూతద్దంలో చూపుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటివరకు రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించారన్నారు. ప్రస్తుత కాల మాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని తిరిగి సమీక్షించాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 107 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించారని, రానున్న రోజుల్లో భద్రాచలంలోని రామాలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలను బీజేపీ నాయకులు తిరిగి తెలంగాణలో కలిపేలా కేంద్రంతో చర్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను విమర్శించే నైతిక హక్కు ఆ పార్టీ నేతలకు లేదన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీబీజీకేఎస్ నాయకుడు ఊకంటి గోపాలరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, నాయకులు రెడ్డిమళ్ల వెంకటేశ్వర్లు, చింతా నాగరాజు, చందూనాయక్ తదితరులు పాల్గొన్నారు.