సత్తుపల్లి, జనవరి 13: ఖమ్మంలో ఈ నెల 18న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభ దేశ రాజకీయాలకు దశ దిశ చూపనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం సభ జయప్రదం కోసం సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని, అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను గమనిస్తున్న పొరుగు రాష్ర్టాల ప్రజలు తమను కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారని గుర్తుచేశారు. నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ పార్టీల నాయకులు హాజరు కానున్నందున ఈ సభ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని పథకాలను సైతం అమలు చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఉన్నాయా.. అని ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు.
తాగు, సాగునీరు, 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దేశంలో, ప్రపంచంలో కాని ఎక్కడైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. రైతుబంధు పథకాన్ని చూసి కేంద్రం పీఎం కిసాన్ పేరుతో పథకాన్ని కాపీ కొట్టిందన్నారు. ఇంటింటికీ నీరందించే మిషన్ భగీరథను చూసి కేంద్రం హర్ ఘర్కో జల్ పేరుతో దేశం యావత్తూ పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. మిషన్ కాకతీయ పథకాన్ని చూసి కేంద్రం అమృత్ సరోవర్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. మానవులకు 108 అంబులెన్స్ లాగానే మూగజీవాలకు సైతం తెలంగాణ ప్రభుత్వం 1062 అంబులెన్స్ సేవలను అమలు చేయగా.. దానిని కూడా కేంద్రం అమలు చేస్తున్నదన్నారు. ప్రతి జిల్లాకొక మెడికల్ కాలేజీని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేయగా.. కేంద్రం కూడా అన్ని జిల్లాలో మెడికల్ కాలేజీల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.
తెలంగాణ పథకాలు అమలు చేయాలి
కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలోని రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకాలు తమకు అమలు చేయాలని, లేనిపక్షంలో తమ నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు తెలంగాణ పథకాలను అమలు చేయాలని, లేనిపక్షంలో తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండు చేస్తున్నారని, ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. దేశ రాజకీయాలు మలుపు తిప్పే చారిత్రాత్మకమైన, విప్లవాత్మకమైన మార్పు తెచ్చేదే ఖమ్మం బీఆర్ఎస్ సభ అని, ఆ సభకు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 50వేలకు పైగా ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట
వీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్కు తన నియోజకవర్గం నుంచి 50 వేల మందిని తీసుకొస్తానని మాటఇచ్చారని, ఆయన మాటను ముఖ్యమంత్రి వద్ద నిలబెట్టాలని సూచించారు. ప్రతి నాయకుడు తమ కార్యకర్తలు, ప్రజలతో వారు వచ్చిన వాహనాల్లోనే రావాలని, క్షేమంగా వారిని మళ్లీ ఇంటికి చేర్చే బాధ్యత వారిదేనన్నారు. సత్తుపల్లి అభివృద్ధికి నిత్యం అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీఎస్ఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ ఛైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ ఛైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సీతారామ ద్వారా జిల్లా సస్యశ్యామలం
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల కోసం 24 గంటల కరంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వం. ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే రూ.50 వేల కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరిచ్చాం. కృష్ణా, గోదావరి జలాలతో కాళేశ్వరం పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. భద్రాద్రి కేటీపీఎస్ పవర్ప్లాంట్లు పూర్తి చేసి లోఓల్టేజీ సమస్యను తీర్చాం. జిల్లాలో కరువు మండలాలైన వేంసూరు, తిరుమలాయపాలెం మండలాల్లోనూ నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తెలంగాణలో పామాయిల్ పంటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. తెలంగాణ మోడల్గా నిలిచేందుకే బీఆర్ఎస్. కేసీఆర్ తలపెట్టిన బీఆర్ఎస్ ఉన్నతికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. 14 ఏళ్లు కష్టపడి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. రాష్ర్టానికి ఏవిధంగా గుర్తింపు తీసుకొచ్చారో, రేపు దేశాన్ని కూడా అదే తరహాలో నిలుపుతారు. ఖమ్మం సభ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయంగా మారుతుంది. చిరస్థాయిగా నిలిచిపోతుంది. సభకు జిల్లా నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలి.
– మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లికి గౌరవం తెచ్చేలా వ్యవహరిస్తా
ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు రాజ్యసభ సీటు ఇచ్చి సేవ చేసే అవకాశం కల్పించారు. జిల్లాపై నమ్మకం ఉంచి రెండు ఎంపీ పదవులు ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా సత్తుపల్లికి గౌరవం తెచ్చేలా వ్యవహరిస్తా. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఎన్నో కొత్త, కొత్త పాఠాలు నేర్చుకున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల జాతర కొనసాగుతున్నది. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని స్థాపించి, విద్య, వైద్య రంగాన్ని అభివృద్ధి చేశారు. నేను కూడా ఆయన బాటలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో రూ.750 కోట్లతో 1,500 పడకలతో త్వరలో ఒక క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపిస్తా. గంగారంలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేస్తా. 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభకు ప్రతి ఇంటి నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలొచ్చి సత్తుపల్లి సత్తాను చాటాలి.
-రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి
దేశ చరిత్రలో బీఆర్ఎస్ సభ నిలిచిపోతుంది
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో చేపట్టిన బీఆర్ఎస్ సభ కోసం యావత్ దేశం ఎదురుచూసున్నది. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజల కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి తాగు, సాగునీరు, విద్యుత్ నిరంతరం అందిస్తున్నారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం నల్లచట్టాలను తీసుకొచ్చి రైతులను అణగదొక్కాలని చూసింది. 15 నెలలపాటు రైతులు ఢిల్లీని ముట్టడిస్తే దిగొచ్చిన కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసింది.
– ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మం సభకు భారీగా తరలి రావాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో తలపెట్టిన బీఆర్ఎస్ సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలి. రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించిన జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాను. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను.
– పల్లా రాజేశ్వరరెడ్డి,రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు
సత్తుపల్లి సత్తా చాటాలి
ఖమ్మంలో తలపెట్టిన బీఆర్ఎస్ సభకు సత్తపల్లి నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి సత్తా చాటాలి. ఈ సభ దేశ రాజకీయాల్లో కీలక మలుపు కాబోతున్నది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా సభను విజయవంతం చేయాలి.
– పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యుడు
సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ఇప్పటికే సత్తుపల్లి పట్టణానికి రూ.60కోట్లు సీఎం మంజూరు చేశారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు కాగా మరిన్ని నిధులు తీసుకొస్తా. పేద ప్రజలెవ్వరూ వైద్యం కోసం ఇబ్బంది పడకుండా రూ.35 కోట్లతో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, మరో రూ.20 కోట్లతో పెనుబల్లి, కల్లూరులో నూతన ఆసుపత్రుల ఏర్పాటు, నియోజకవర్గంలో 24 పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగింది.
– సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే