CM KCR | ఖమ్మం, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు హాజరైన సీఎం కేసీఆర్ మూడోసారి ఖమ్మం, కొత్తగూడెంలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రకాశం స్టేడియంలో అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరుతూ మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో శాసనసభ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ ప్రసంగించనున్నారు. రెండు సభలకు ప్రజలు స్వచ్ఛందంగా.. భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. శనివారం ఖమ్మంలో ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు పరిశీలించారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తదితరులు పరిశీలించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రమైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ఎస్ అధినేత హోదాల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించిన విషయం విదితమే. ఈ సభలు అద్భుతంగా విజయవంతమయ్యాయి. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ సభల్లో కేసీఆర్ స్థానిక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్లో చేరిన నేతల వ్యవహార శైలిని తూర్పారబడుతున్నారు. దీంతో సభకు హాజరైన ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తోంది.
మొదట కొత్తగూడెంలో..
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ సభలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం పాల్గొననున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఖమ్మం సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పర్యవేక్షించారు. కొత్తగూడెం సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పరిశీలించారు. సీఎం కేసీఆర్ రానుండడంతో ఆయా జిల్లాల పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కాగా, ఆశీర్వాద సభలకు రెండు నియోజకవర్గాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. ఖమ్మంలోని పలేట్ స్టేడియంలో, కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో హెలీప్యాడ్లను అధికారులు సిద్ధం చేశారు.
కొత్తగూడెంలో ఏర్పాట్ల పరిశీలన..
సింగరేణి కార్మికుల అడ్డా అయిన కొత్తగూడెం గడ్డ మీదకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రానున్నారు. పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ నేత కోనేరు సత్యనారాయణ (చిన్ని) శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను ఇల్లెందు వైపునకు, విజయవాడ వెళ్లే వాహనాలను పాల్వంచ మీదుగా మళ్లించారు.
కొత్తగూడెంలో వనమా గెలుపు ఖాయం: వద్దిరాజు
తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతోందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెంలో సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న వనమా వెంకటేశ్వరరావు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని స్పష్టం చేశారు.
సింగరేణి గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తాం: వనమా
సింగరేణి పురిటిగడ్డ కొత్తగూడెంలో గులాబీ జెండాను ఎగరేస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం జరిగే సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. కొత్తగూడెం, పాల్వంచ జంట పట్టణాలను అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు.