ఎర్రుపాలెం, ఆగస్టు 31 : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సోమవారం ఎర్రుపాలెం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల స్థాయి విస్తృత సమావేశానికి కమల్రాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెయ్యి రోజులు గడిచినా వాటిని నెరవేర్చలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, రైతు మరణిస్తే వారి కుటుంబానికి భరోసా కల్పించిన రైతుబీమా ప్రీమియాన్ని కూడా పూర్తిగా నిలిపివేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజల పరిస్థితి కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా మారిందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే తానే చేస్తున్నట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం తప్ప సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు చేపట్టే నిరసన కార్యక్రమాలను మధిర నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని కమల్రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళనలను విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, సర్పంచులు శీలం రామకోటారెడ్డి, వేల్పుల బెంజిమెన్, కొల్లు శ్రీనివాసరావు, మండల నాయకులు గూడూరు రమణారెడ్డి, శేగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, కుడుముల మల్లికార్జునరెడ్డి, బొర్ర నరసింహారావు, యరమల కృష్ణారెడ్డి, కోట శ్రీనివాసరావు, సంక్రాంతి కృష్ణారావు, బాలరాఘవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, తిరుపతిరావు, నాగేశ్వరరావు, కాళేశ్వరరావు, వెంకటనారాయణ, రవి, పూర్ణారెడ్డి, పుల్లారెడ్డి, వెంకయ్య, వెంకటేశ్వరరావు, వెంకట్తో పాటు యువజన, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.