కూసుమంచి, డిసెంబర్ 19 : రైతులు చేపల పెంపకంతో లాభాలు గడించవచ్చని, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ చేపల చెరువులు విరివిగా వేసుకోవాలని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. పాలేరులోని పీవీ నర్సింహారావు పశు, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని చేపల పెంపకం కేంద్రంలో మూడు రోజులపాటు తెలంగాణలోని ఏడు జిల్లాలకు చెందిన 25 మంది మత్స్యకారులకు శిక్షణ ఇచ్చారు. మంగళవారం శిక్షణ ముగింపు కార్యక్రమంలో శ్యాంప్రసాద్ మాట్లాడారు.
రైతులు చేపల పెంపకానికి ముందుకొస్తే వారికి కలిగే లాభాలు, చేపల ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెటింగ్, వాటికి వచ్చే వ్యాధులను క్షేత్రస్థాయిలో పరిశీలించి శిక్షణ ఇస్తామని తెలిపారు. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ జీ.శ్రీనివాసరావు మాట్లాడుతూ చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ రవీందర్ చేపల ఉత్పత్తులకు గల అవకాశాల గురించి వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కుమ్రంభీం, కామారెడ్డి జిల్లాలకు చెందిన మత్స్యకారులకు సర్టిఫికెట్లు అందజేశారు.