మామిళ్లగూడెం, మే 26: ఈసీ మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఉమ్మడి వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రిని పంపిణీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పూర్తి పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఆదివారం రాత్రి అక్కడే బస చేయాలని, సోమవారం ఉదయం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఉదయం 7:30 గంటల కల్లా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జంబో బాక్సుల సీలింగ్ ప్రక్రియ చేపట్టాలన్నారు.
జంబో బాక్సు ఖాళీగా ఉన్నట్లు చూపించి, అడ్రస్ ట్యాగ్ చేయాలని, బాక్స్ మూతపెట్టి 2 తాళాలు వేసి, స్టికర్ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో 800 ఓట్ల కంటే ఎకువ ఓట్లు ఉంటే రెండు ఓటింగ్ కాంపార్టుమెంట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బాక్సుల సీలింగ్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటు సీక్రసీకి విఘాతం కలగకూడదని స్పష్టం చేశారు. బ్యాలెట్తో కూడిన ఎన్నికల కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఓటరునూ ప్రిసింగ్ చేయాలని, తనిఖీ చేసిన తరువాతనే అనుమతించాలని సూచించారు. జిల్లాలో 40 లోకేషన్లలో 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రిజర్వ్తో కలుపుకుని 129 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామన్నారు. పోలింగ్ తరువాత ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు వస్తాయని, అకడి నుంచి కౌంటింగ్ కోసం నల్గొండకు బందోబస్తుతో చేరుకుంటాయని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఇతర జిల్లా అధికారులు రాజేశ్వరి, గణేశ్, రాజేందర్, శ్రీలత, శ్రీరామ్, మదన్గోపాల్, అరుణ, రాంబాబు పాల్గొన్నారు.