ఖమ్మం వ్యవసాయం, జనవరి 27: మార్కెట్ యార్డుకు రైతులు తెస్తున్న పంటకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధర కల్పించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. ఖమ్మం ఏఎంసీలో ‘మిర్చి క్రయవిక్రయాలు – ధరల’ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ వ్యాపారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉన్నతశ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్తో కలిసి శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యార్డుకు పంటను తీసుకొచ్చిన రైతుల ఉత్పత్తులను నిత్యం పరిశీలించాలని ఉద్యానశాఖ టెక్నికల్ అధికారులకు సూచించారు. జెండాపాటకు, మిగిలిన లాట్లకు భారీ తేడా ఉండవద్దన్నారు. ప్రతి రైతుకూ పంట నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నాణ్యత విషయంలో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఏఎంసీ అధికారులు, వర్తక సంఘం బాధ్యులు బజార్, వజీరుద్దీన్, చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలం, యడ్లపల్లి సతీశ్, దిరిశాల వెంకటేశ్వర్లు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, రమణ పాల్గొన్నారు.