ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 10: పది పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లావ్యాప్తంగా 97 సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు ఇప్పటికే ఇన్విజిలేటర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. సోమవారం ఈ మేరకు ఇన్విజిలేటర్లు ఉత్తర్వులు అందుకోనున్నారు. ఇన్విజిలేషన్కు విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులు మినహా 1,133 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించింది. వీరు రెండు స్పెల్స్లో విధులు నిర్వర్తించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్ల పరీక్షలు జరుగుతున్న సమయంలో గణితం, భౌతిక, రసాయనశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్ర పరీక్షలు జరిగే సమయంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్లు బోధించే ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తారు.
ఇన్విజిలేటర్ల విధులు ఇవీ..
సీఎస్, డీవోలు జారీ చేసిన సూచనలు, ఆదేశాలను ఇన్విజిలేటర్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పరీక్ష రోజు వీరు 45 నిమిషాలు ముందుగానే పరీక్షా హాల్కు వెళ్లాలి. విద్యార్థులకు సమాధాన పత్రాలు, ఓఎంఆర్ షీట్స్ అందించాలి. ప్రశ్నాపత్రాల ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. రాంగ్ కాంబినేషన్లో ప్రశ్నాపత్రాలు అందిస్తే ఇన్విజిలేటరే బాధ్యుడవుతాడు. వారిపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి. విద్యార్థులు అదనపు సమాధాన పత్రం తీసుకుంటే ఆ షీటు సీరియల్ నంబర్ను ప్రొ ఫార్మా-3లో నమోదు చేయాలి. విద్యార్థుల సంతకాల తీసుకోవాలి. ఇన్విజిలేటర్ సంబంధీకులెవరూ పరీక్షా సెంటర్లో లేరని ముందుగా నిర్వాహకులకు ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. పరీక్షా హాల్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లకూడదు. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల నుంచి మీడియాల వారీగా సమాధాన పత్రాలు తీసుకోవాలి. పరీక్ష ముగిసిన తర్వాతే విద్యార్థులను పరీక్షల హాల్ నుంచి బయటకు పంపించాలి. పరీక్ష విధుల నిర్వహణకు నియమించిన వారు హాజరుకాకపోతే సీసీఏ రూల్స్, యాక్ట్ 25/97 ప్రకారం వారిపై చర్యలు ఉంటాయి.
బధిరులు, అంధులకు సహాయకులు..
పీహెచ్ క్యాటగిరీ -1, క్యాటగిరీ-2 నిబంధనల మేరకు జిల్లావ్యాప్తంగా 42 బధిరులు, అంధ విద్యార్థులు సహాయకులతో పరీక్ష రాయించుకోనున్నారు. వీరికి సహాయకులను నియమించేందుకు ఇప్పటికే విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి డీఈవో కార్యాలయానికి ఆదేశాలు అందాయి. సదరు విద్యార్థులకు సహాయకులుగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. అందుకు తొమ్మిదో తరగతి విద్యార్థులు బోనఫైడ్ సర్టిఫెకెట్స్ను పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు అందించాల్సి ఉంటుంది.
సివిల్ డ్రెస్కే అనుమతి..
పరీక్షలకు 282 ప్రభుత్వ స్కూల్స్ నుంచి 10,146 మంది, 141 ప్రైవేట్ స్కూల్స్ నుంచి 6,368 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సాధారణంగా ఒక్కో స్కూలుకు ఒక్కో యూనిఫాం కోడ్ ఉంటుంది. ఫలానా యూనిఫాం ఫలానా స్కూల్కు చెందినది అని సులభంగా పరీక్షల నిర్వాహకులకు తెలిసిపోతుంది కాబట్టి విద్యాశాఖ సివిల్ డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నది. యూనిఫాంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది.
జిల్లా అబ్జర్వర్గా శ్రీనివాసాచారి..
పది పరీక్షల ఉమ్మడి జిల్లా అబ్జర్వర్గా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి నియమితులయ్యారు. ఆయన పరీక్షకు రెండు రోజుల ముందు జిల్లాకు చేరుకుని పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారి, పరీక్షల విభాగ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ శివరాత్రి, 9న రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం సెలవులనైప్పటికీ డీఈవో సోమశేఖరశర్మ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ ధనాతో కలిసి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర పరీక్షల విభాగం స్పెల్స్ వారీగా ఇప్పటికే జిల్లాలకు ప్రశ్నాపత్రాలను చేర్చింది. ఆ ప్రశ్నాపత్రాలు ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో భద్రంగా ఉన్నాయి.