ఏ నోట విన్నా రామజపమే.. ఊరూవాడ రాములోరి కాషాయజెండాల రెపరెపలమయం.. ఆలయాల్లో సీతారాములకు ప్రత్యేక పూజలు. ఇళ్ల ముంగిళ్లలో రంగురంగులతో రామరథం ముగ్గులు.. జై శ్రీరాం.. జైజై శ్రీరాం అంటూ హోరెత్తిన యువకుల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు.. వెరసి ఉమ్మడి ఖమ్మంజిల్లా అంతటా సోమవారం పండుగ వాతావరణం నెలకొన్నది. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తిభావం ఉప్పొంగింది. రామయ్య, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. మహిళలు, యువతులు రామయ్య పాటలు పాడుతూ కోలాటాలతో శోభాయాత్రలు నిర్వహించారు. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు.
అయోధ్యలో జరిగిన వేడుకను తిలకించేందుకు గ్రామాల్లో భక్తమండళ్లు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇళ్లల్లో సైతం కుటుంబసమేతంగా ఆ అపురూప ఘట్టాన్ని టీవీల్లో తిలకించారు. అయోధ్య నుంచి వచ్చిన తలంబ్రాలను ఇంటింటికీ పంచిపెట్టగా వాటిని పూజా మందిరంలో ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. భద్రాచలం రామాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మంలోని పలు ప్రధాన సెంటర్లలో గల వ్యాపార సముదాయాలు, దుకాణాల ఎదుట గంటలు కొట్టి భక్తిభావాన్ని చాటుకున్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రైటర్బస్తీలో త్రిమాత శక్తిపీఠం వద్ద భారీ ఎల్ఈడీలు ఏర్పాటుచేశారు. సాయంత్రం ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వెలిగించారు.
భద్రాచలం, జనవరి 22 : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అంతరాలయంలోని మూలవరుల వద్ద విశేష పూజలు చేసిన అనంతరం బేడా మండపం వద్ద స్వామివారి నిత్య కల్యాణ మూర్తులకు సువర్ణ పుష్పార్చన చేపట్టారు. తర్వాత దేవస్థానం ప్రచార రథంతో మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాలు, భక్తుల రామనామ స్మరణతో శోభాయాత్ర నేత్ర పర్వంగా సాగింది.
అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకొని భద్రాద్రి రామాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం దీపోత్సవం కార్యక్రమాన్ని నేత్రపర్వంగా జరిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఏఈవో శ్రావణ్కుమార్, ఈఈ రవీందర్రాజు, అనిల్కుమార్, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. కాగా.. వివిధ భక్త సమాజ బృందాలు, పలు అధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలో పాదయాత్ర, బైక్ యాత్ర చేపట్టారు.