భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామసభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు తలెత్తుతున్న సమస్యలను నివృత్తి చేసేవారు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి దరఖాస్తు ఫారాలు అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు సరిపోతుందని చెప్పి ఒక ఫారం మాత్రమే ఇవ్వడంతో ఆ కుటుంబంలోనే విడిగా ఉంటున్న వారికి దరఖాస్తు ఫారాలు లేకపోవడంతో అధికారులను బతిమిలాడాల్సిన పరిస్థితి వస్తోంది. అభయహస్తం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో అసలు పథకం వస్తుందా.. రాదా.. అనే అనుమానం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దరఖాస్తు ఫారంలో బ్యాంకు ఖాతా నెంబర్ లేకుండా లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామసభల మొదటి రోజు నుంచి ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు తీసుకున్న దరఖాస్తులన్నీ కార్యాలయాలకే పరిమితమయ్యాయి. అంతేకాక గ్రామసభల నిర్వహణపై ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే దరఖాస్తుదారుల అనుమానాలు పూర్తిస్థాయిలో నివృత్తి కాకపోవడంతో వారు సతమతమవుతున్నారు.
ఇప్పటివరకు జరిగిన ప్రజా పాలన గ్రామసభల్లో ప్రజల నుంచి 51,484 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. 52,962 కుటుంబాలు వారు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. 75 గ్రామ పంచాయతీలు, 52 మున్సిపల్ వార్డుల్లో గ్రామసభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానాలు ఉన్నా హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తు ఫారాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఉదయం 8 గంటలకే సభలు ప్రారంభించి.. సాయంత్రం 6 గంటలకు ముగిస్తున్నట్లు వివరించారు.