డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులు కాపాడుకోవాలి
పారిశుధ్య, హరితహారం పనులు నిరంతరం చేపట్టాలి
ఏజెన్సీ పర్యటనలో భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం, కలెక్టర్
మోరంపల్లి బంజర పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పర్ణశాల/ బూర్గంపహాడ్, జూన్ 7: పల్లె ప్రగతి పనులను సక్రమంగా నిర్వహించాలని భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్ సూచించారు. డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లను కాపాడుకోవాలని సూచించారు. చర్ల మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం వారు పర్యటించారు. తొలుత చిన్నబండిరేవులో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించారు. అనంతరం పక్కనే ఉన్న పల్లెప్రకృతివనాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి పక్కన రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దనల్లబల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పారిశుధ్యం, హరితహారం పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చిన్నబండిరేవుకు కొత్త అంగన్వాడీ కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గౌరారం డబుల్ బెడ్ రూం ఇళ్లపై పిట్ట గోడలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సంగెం గ్రామానికి వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మించాలని పెద్దనల్లబల్లి సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరావు కోరారు. జడ్పీటీసీ సీతమ్మ, ఎంపీపీ లక్ష్మి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, సర్పంచ్ కారం జయ, ఏవో నవీన్కుమార్, ఐటీడీఏ డీఈ హరీశ్, జేఈ వెంకటేశ్వర్లు, సత్యనారాయణమూర్తి, రంజిత్కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి..
బూర్గంపహాడ్, జూన్ 7: ప్రభుత్వం సకల సౌకర్యాలూ కల్పిస్తున్నందున ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. మంగళవారం మోరంపల్లి బంజరలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల గురించి వైద్యురాలు స్పందనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశాలు, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి గ్రామాల్లో నిత్యం పర్యటించాలన్నారు. హెచ్ఈవో రవి, యూడీపీ పరమేశ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.