ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 31 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు స్పెల్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో స్పెల్లో ఐదు రోజుల చొప్పున ఖమ్మం జిల్లాలోని 86 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా.. పారదర్శకంగా నిర్వహించేందుకు అరగంట ముందు మాత్రమే ఆన్లైన్ విధానంలో ప్రశ్నాపత్రాన్ని కళాశాలలకు చేర్చనున్నారు. ఈసారి ఇంగ్లిష్ సబ్జెక్ట్లో సైతం ప్రాక్టికల్ పరీక్షను 16వ తేదీన నిర్వహించనున్నారు.
గతంలో ప్రశ్నాపత్రాలు కళాశాలలకు వారం రోజుల ముందుగా చేరుకోవడంతో అక్రమాలు జరిగేందుకు ఆస్కారం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నూతన పద్ధతులను ప్రవేశ పెట్టింది. దీంతో వన్టైమ్(ఓటీపీ) పాస్వర్డ్ విధానంలో పరీక్ష కేంద్ర ఎగ్జామినర్ సెల్ఫోన్కి అరగంట ముందు మాత్రమే ఆన్లైన్లో ప్రశ్నాపత్రాన్ని పంపుతారు. ఎగ్జామినర్ సెల్ఫోన్కి మెసేజ్ రాగానే అతను సంబంధిత వెబ్సైట్ నుంచి ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రశ్నలు ముందుగా తెలిసే అవకాశం ఉండదు. అలాగే హాల్టికెట్ ఆధారంగా ఏ విద్యార్థికి ఏ సెట్ ప్రశ్నాపత్రం ఇవ్వాలనే అంశాన్ని పేపర్ కోడ్ ఆధారంగా వెబ్సైట్లో పేర్కొంటారు. కళాశాలలవారీగా ప్రశ్నాపత్రాల కోడ్లు వేర్వేరుగా ఉండడంతోపాటు పరీక్ష సమయానికి అరగంట ముందుగా ఇన్విజిలేటర్ హాల్టికెట్ ఆధారంగా ప్రశ్నాపత్రం డౌన్లోడ్ ఇచ్చేలా మార్పులు చేశారు.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్ పరీక్షలు 15వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన తర్వాత గంటలోపే అధ్యాపకులు సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. వాల్యుయేషన్ చేసిన మార్కుల జాబితాను ఎగ్జామినర్ ఇంటర్ బోర్డుకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే సీసీ కెమెరాలను అమర్చారు. ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేట్ కేంద్రాల్లోనూ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 86 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 76 కేంద్రాలు జనరల్ విద్యార్థులకు, 10 కేంద్రాలు ఒకేషనల్ విద్యార్థుల కొరకు ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లాలో 13,194 మంది జనరల్ కోర్సు విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరవుతుండగా.. 4,650 మంది వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన వారు పరీక్షలు రాయనున్నారు. మూడు దశల్లో నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ కేటాయించారు. ఇందులో భాగంగా స్పెల్ను 5 రోజులపాటు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణను డీఐఈవో రవిబాబు పర్యవేక్షించనున్నారు. ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్లతోపాటు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ, హైపవర్ కమిటీ పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టనున్నారు.