కామేపల్లి, జూలై 4 : మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం)లో బీఆర్ఎస్ కార్యకర్తలపై పొంగులేటి అనుచరులు దాడులు చేస్తూ, హత్యాయత్నానికి పాల్పడుతున్నారు. సోమవారం అర్ధరాత్రి కొమ్మినేపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ఇండ్లలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి అనుచరులు చొరబడి దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పండితాపురం గ్రామానికి చెందిన మేకపోతుల లక్ష్మీ, అర్వపల్లి కోటమ్మ ఇంట్లోకి అకారణంగా వచ్చిన పొంగులేటి అనుచరులు తమ వెంట తీసుకువచ్చిన ఇనుప రాడ్లు, కత్తులు, కర్రలు, రాళ్లు, కారంతో దాడి చేసి లక్ష్మీ మేడలోని బంగారపు పుసైల తాడును ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో లక్ష్మీ, కోటమ్మకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న చల్లా నాగేంద్రబాబు, చల్లా అనిల్పై దాడి చేయడంతో నాగేంద్రబాబుకు కాలు విరగగా, అనిల్ తలకు తీవ్రగాయమైంది. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీసి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.
మరోమారు దాడి..
మంగళవారం ఉదయం మరో ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పొంగులేటి అనుచరులు దాడి చేశారు. తమ పిల్లలకు టిఫిన్ తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై హోటల్ వద్ద వెళ్తున్న శశిని అడ్డుకుని దాడిచేస్తుండగా చల్లా వెంకటనారయణ, చల్లా రవి అడ్డుగా వెళ్లారు. ఈ ఘటనలతో రవి, వెంకటనారాయణ చేతులు విరిగిపోయాయి. శశి తలపై కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. క్షత్రగాత్రులను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి వైద్యసేవలు అందించారు. శశి అపస్మారక స్థితిలో ఉండడం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపి మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. శశిని హైదరాబాద్ తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడిన ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
గ్రామంలో 144 సెక్షన్ : ఏసీపీ బస్వారెడ్డి
కొమ్మినేపల్లి గ్రామంలో దాడుల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. అదేవిధంగా మండలంలో బెల్ట్ షాపులు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం నిర్వహించే వారంతపు పశువుల సంత బంద్ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు సమన్వయంతో పోలీసులకు సహకరించాలని, దాడులు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
మహిళలపై దాడులు చేయడం సిగ్గుచేటు : ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్
కొమ్మినేపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లలోకి చొరబడి మహిళలపై దాడులు చేసి గాయపర్చడం సిగ్గు చేటని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. సోమ, మంగళవారం కాంగ్రెస్ పార్టీలోని పొంగులేటి అనుచరుల దాడిలో గాయపడిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దాడులు చేయడం సరైంది కాదని, ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పొంగులేటి అనుచరుడు మేకల మల్లిబాబుయాదవ్ దాడులు చేసి అరాచకం సృష్టిస్తున్నాడని, ప్రజల ఆదరణ కోల్పోవడంతోనే ఆయన విచక్షణ కోల్పోయి కొంతమందిని ఉసికొల్పి వారితో దాడులు చేయిస్తున్నాడని, వారి ఆటలు సాగవన్నారు. గ్రామస్తులంతా సమన్వయం పాటించాలని, దాడులు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, గ్రామ ప్రజల్లో నెలకొన్న భయాందోళనను తొలగించాలని పోలీసులకు సూచించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు : ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. కొమ్మినేపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిగిన విషయాన్ని ఎమ్మెల్సీ తాతా మధు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావుకి ఫోన్ చేసి తెలుసుకున్నాడు. దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సమన్వయం పాటించి, పోలీసులకు సహకరించాలని సూచించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు ఆయన తెలిపారు.