ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 17: పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ – 2023 బుధవారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష ఉండడంతో విద్యార్థులకు పది గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఎండల దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలోని ఆరు కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 2,604 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 249 మంది గైర్హాజరయ్యారు. 2,355 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఖమ్మంలో పాలిసెట్ పరీక్షలో ప్రశాంతంగా జరిగినట్లు కోఆర్డినేటర్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా తెలిపారు.
టెక్నికల్ కోర్సు అయిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను స్పెషల్ అబ్జర్వర్ ప్రభాకర్ తనిఖీ చేశారు. జిల్లాలోని పరీక్ష జరుగుతున్న కేంద్రాలను పరిశీలించారు. ఆరు కేంద్రాల్లోనూ పర్యటించి పరీక్షలు జరుగుతున్న తీరు, విద్యార్థుల సీటింగ్ అలాట్మెంట్, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. స్పెషల్ అబ్జర్వర్తోపాటు ఎస్అర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా తదితరులు ఉన్నారు. కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
భద్రాద్రి జిల్లాలో జరిగిన పాలిసెట్ పరీక్షను కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కో ఆర్డినేటర్ నాగముని నాయక్ పర్యవేక్షించారు. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కొత్తగూడెంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో 66 మందికిగాను ముగ్గురు, సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీలో 379 మందికిగాను 21 మంది, మహిళా జూనియర్ కాలేజీలో 278 మందికి గాను 22 మంది, సింగరేణి ఉన్నత పాఠశాలలో 223 మందికి గాను 17 మంది, శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 193 మందికిగాను ఏడుగురు, చుంచుపల్లి హైస్కూల్లో 279 మందికి గాను 21 మంది, కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 283కిగాను 17 మంది, సత్తుపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 272 మందికిగాను 28 మంది, సత్తుపల్లి సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో 138 మందికిగాను 12 మంది, సత్తుపల్లి మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీలో 282 మందికిగాను 18 మంది, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 285 మందికిగాను 15 మంది, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 138 మందికిగాను 12 మంది, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 277 మందికిగాను 23 మంది, భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆర్ట్స్ బ్లాక్లో 276 మందికిగాను 24 మంది, సైన్స్ బ్లాక్లో 90 మందికిగాను 9 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 3,948 మంది విద్యార్థులకు గాను 3,682 మంది హాజరయ్యారు. 266 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.