ఖమ్మం: పోలీస్ వాహానాలను సక్రమ పద్దతిలో నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. పోలీస్ వాహనాల మెయింటెనెన్స్లో భాగంగా డ్రైవర్లకు అవగాహన పెంపొందించేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒకరోజు వర్క్ షాప్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వాహనాలకు సంబంధించిన టెక్నీషియన్స్ పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సేవ కోసం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పోలీస్ శాఖకు కల్పించిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని వాహనాల నిర్వహణ క్రమ శిక్షణతో పారదర్శకంగా చేయాలని సూచించారు.
ఇటీవల భూపాలపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఎఏస్సై మృతి చెందడం దురదృష్టకరమని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరింత అప్రమత్తంగా వుండాలని అన్నారు. విధిగా ఇలాంటి రిఫ్రెష్ కోర్స్లు షిఫ్ట్ల వారిగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్ డ్రైవర్లకు క్రమశిక్షణ అనేది చాల కీలకమని, ఎవరికైతే వాహనాలు అప్పగించామో వారిదే పూర్తి బాధ్యతని అన్నారు. పూర్తి ఫిట్నెస్ వుండేలా నిర్వహణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఎంటీవో శ్రీనివాస్, ఆర్ఐలు రవి, శ్రీశైలం, ఎంటీ సెక్షన్ మెకానిక్ టి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.