మామిళ్లగూడెం, మార్చి 20 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారా మిలటరీ బలగాలు, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు భంగం కలగకుండా పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు.
క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన బందోబస్తుకు అవసరమైన సన్నాహాలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే పోలీసు కవాతు నిర్వహించామన్నారు. పోలీస్ స్టేషన్లవారీగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం.. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే నేరచరితులను బైండోవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ మద్యం, నగదు, కానుకల రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లా సరిహద్దులో చెక్ పోస్టుల ద్వారా నియంత్రించే చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హకు వినియోగించుకునేందుకు వీలుగా ఖమ్మం నగరంతోపాటు వైరా, సత్తుపల్లి, మధిర, ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లోని సెంట్రల్ పోలీస్ ఫోర్స్తో ఫ్లాగ్మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోల్ట్స్ బృందాలు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని సీపీ పేర్కొన్నారు.