భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని, అక్కడ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందానికి(పీపీఏ) లేఖ రాశారు. రెండు రోజులుగా పీపీఏ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ముంపు సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని హరీశ్రావు కోరారు. ఆ లేఖను గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో పీపీఏ బృందం సభ్యులకు స్థానిక భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు అందజేశారు.
ఇప్పటికే చాలా సంస్థలు సర్వేలు చేసి రెండు నియోజకవర్గాల్లో 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని వెల్లడించాయని, ముంపు గ్రామాల బాధితులకు తక్షణమే పరిహారం అందజేయాలని, ఏటా వచ్చే వరదల వల్ల భద్రాచలం ప్రాంతంలోని ఆయా గ్రామాల ప్రజలు ఇప్పటికే నష్టపోతున్నారని, గోదావరి కరకట్టల ఎత్తు పెంచి ముంపు నుంచి ప్రజలను కాపాడాలని, తూతూమంత్రంగా సర్వే చేయకుండా సర్వే చేసిన రిపోర్టును ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు. 2022లో బ్యాక్వాటర్ వల్ల నష్టపోయిన భద్రాచలం ముంపు బాధితులు దాదాపు లక్ష మందికి తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో తరచూ నీటమునిగిపోతున్న 2వేల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రత్యేక వసతి కల్పించాలన్నారు.
రెండు ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న రైతులకు కూడా పరిహారం అందించాలన్నారు. ఇందుకోసం భద్రాచలంలో బ్యాక్వాటర్కు సంబంధించిన అధికారి కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి ఏటా వచ్చే వరదల బ్యాక్వాటర్ వల్లనే భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, అశ్వాపురం, దుమ్ముగూడెం ప్రాంతాలు చాలా తొందరగా నీటమునిగి పోతున్నాయన్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేలు చేయడం వల్ల అప్పటి ఖమ్మంజిల్లాలో ఉన్న ఏడు మండలాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇప్పటికీ వారికి పరిహారం రాక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. హరీశ్రావు రాసి పంపిన వినతిపత్రాన్ని కమిటీ సభ్యులకు అందజేసిన వారిలో భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మానె రామకృష్ణ, గోపిరెడ్డి రమణారెడ్డి, బిక్కసాని శ్రీను, సిరిపురం స్వప్న, మెండుగా లక్ష్మీనారాయణరెడ్డి, దారం కృష్ణారెడ్డి, పాటి అశోక్, భూక్యా కృష్ణ, సాంబ, వంశీ, జగదీశ్, సొసైటీ చైర్మన్లు, ఇతర నాయకులు ఉన్నారు.