మామిళ్లగూడెం, జనవరి 30: అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరిలో జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. ‘పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు – మన బడి, ఆయిల్పాం సాగు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, జీవో 58, 59, ఐడీవోసీ’లపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. పోడు భూముల సమస్యపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఇప్పటికే క్షేత్రస్థాయిలో వంద శాతం సర్వేలు, గ్రామసభలు పూర్తి చేశామని అన్నారు. ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలను అధికారులు పూర్తి చేయాలని సూచించారు.
అడవులను సంరక్షిస్తూనే చట్టానికి లోబడి సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులకు పోడు పట్టాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాల వారీగా మరొకసారి సమీక్షించుకుని అర్హులైన ప్రతి ఒకరికీ న్యాయం చేయాలని సూచించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి.. మాట్లాడుతూ పోడు పట్టాల పంపిణీ పూర్తయ్యాక మరోసారి అటవీశాఖకు చెందిన ఇంచు భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ..కలెక్టర్ల డీఎల్సీ మాడ్యూళ్లు అందుబాటులోకి వస్తాయని, రెండు రోజుల్లో ఎస్డీఎల్సీ నుంచి వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం ‘కంటి వెలుగు, టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ, మన ఊరు – మన బడి, ఆయిల్పాం సాగు’ వంటి అంశాలపై కలెక్టర్లతో సీఎస్ చర్చించారు. ‘మన ఊరు – మన బడి’ కింద పూర్తి చేసిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించాలని, ఇందులో విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సమాధానమిస్తూ.. పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వ సూచనల ప్రకారం సిద్ధంగా ఉన్నామని అన్నారు. ‘మన బడి’ పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభిస్తామన్నారు. కంటి వెలుగుపై ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, డీఈవో సోమశేఖరశర్మ, డీఎంహెచ్వో మాలతి, ఇతర అధికారులు కృష్ణనాయక్, అనిత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.