లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 27: భద్రాద్రి జిల్లా అడవుల్లో పునరుజ్జీవన వైభవం వెల్లివిరుస్తోందని ప్రధాన అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (కాంపా) లోకేశ్ జైస్వాల్ పేర్కొన్నారు. అటవీ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు, మొక్కల పెంపకం వంటివి ఎంతో బాగున్నాయని అన్నారు. భద్రాద్రి సర్కిల్ పరిధిలోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను ఆయన పరిశీలించి అధికారులు, సిబ్బందిని అభినందించారు. గడిచిన మూడు రోజులుగా అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన.. అటవీ శాఖ చేపట్టిన ప్లాంటేషన్లు, నర్సరీలు, ఫారెస్టు రోడ్లు, ఫైర్లైన్లు, వాచ్ టవర్లు, బేస్ క్యాంపులు, సిబ్బంది నివాస గృహాలు, వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన నీటి కుంటలు, గడ్డి మైదానాలు, చెక్ డ్యాములు, రాతి కట్టలు, కందకాలు తదితర పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. భద్రాద్రి సర్కిల్ పరిధిలో క్షీణించిన అడవులకు పునర్వైభవం తీసుకురావడంలో భాగంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలను అత్యంత ప్రభావవంతంగా చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 340 ఫారెస్టు బ్లాకుల్లోని 6,29,422 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో పునరుజ్జీవన పనులను చేపట్టామని, 361 కిలోమీటర్ల మేర అటవీ సరిహద్దుల వెంబడి కందకాలు తవ్వామని అన్నారు. సీసీఎఫ్ భీమానాయక్, డీఎఫ్వోలు రవికిరణ్, అర్పన, రంజిత్నాయక్, వసంత, సిద్ధార్థ విక్రమ్సింగ్, ఎఫ్డీవోలు కృష్ణమాచారి, దామోదర్రెడ్డి, తిరుమలరావు, మక్సూద్, చంద్రశేఖర్, అప్పయ్య, బాబు, మంజుల తదితరులు పాల్గొన్నారు.