భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఎంపీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా 1,095 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. సోమవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్తోపాటు ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు అనుసంధానంగా ఉన్న ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల ఆర్వోలు అక్కడే ఉంటారని, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏఆర్వోలు ఉంటారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేశామని, ఇప్పటివరకు రూపొందించిన జాబితాలో 9,84,629 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో మహిళలు 5,06,471 మంది ఉండగా.. పురుషులు 4,78,098 మంది ఉన్నారని తెలిపారు. ట్రాన్స్జెండర్లు 60 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఐదు నియోజకవర్గాల్లో ఏఆర్వోలను నియమించామని, పినపాకకు ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఇల్లెందుకు జే.కాసయ్య(ఎస్డీసీ), అశ్వారావుపేటకు డి.వేణుగోపాల్(అదనపు కలెక్టర్), భద్రాచలంకు ఆర్డీవో దామోదర్, కొత్తగూడెంకు ఆర్డీవో డి.మధులను నియమించినట్లు తెలిపారు.
ఎన్నికల నిబంధనలు
ఎన్నికల కోడ్ను పటిష్ఠంగా అమలుపరిచేందుకు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్ పోస్టులను 12 ఏర్పాటు చేశామన్నారు. ఒక వ్యక్తి వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉంటే సీజ్ చేస్తామని, ఎలాంటి ఆధారాలు లేని నగదు రూ.10 లక్షలు ఉన్నా వాటిని కూడా సీజ్ చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో నిరంతరం పోలీసుల తనిఖీలు ఉంటాయని, దీనికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. విలేకరుల సమావేశంలో పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.