కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 19 : మావోయిస్టులు తమ స్వార్థం కోసం ఏజెన్సీల్లో నివసించే అమాయకపు ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని, మావోయిస్టు పార్టీ నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని రాష్ట్ర డీజీపీ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దుల్లోని చర్ల మండలం పూసుగుప్పలో నూతనంగా నిర్మితమవుతున్న సీఆర్పీఎఫ్ క్యాంప్ను ఆయన బుధవారం సందర్శించారు. ముందుగా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న డీజీపీకి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ… తెలంగాణలో మావోయిస్టులు పూర్తిగా పట్టును కోల్పోయారని, ఆ పార్టీని ప్రజలు విశ్వసించట్లేదన్నారు.
మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల పనితీరు ప్రశంసనీయం అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన పూసుగుప్పలో భద్రతా బలగాల కోసం క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం క్యాంపులో ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను పరిశీలించారు. ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలోనే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పూసుగుప్ప నుంచి హెలీకాఫ్టర్ ద్వారా ములుగు జిల్లా వెంకటాపురం చేరుకుని అక్కడి పోలీస్ స్టేషన్కు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అదనపు డీజీపీ (గ్రేహౌండ్స్) కె.శ్రీనివాస రెడ్డి, నార్త్జోన్ అదనపు డీజీపీ వై. నాగిరెడ్డి, ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర, భూపాలపల్లి ఎస్పీ జె. సురేందర్ రెడ్డి, ములుగు ఓఎస్డీ గౌస్ అలాం, కొత్తగూడెం ఓఎస్డీ టి. సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, ములుగు ఏఎస్పీ సుధీర్, ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు.