పర్ణశాల, ఏప్రిల్ 15 : శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17వ తేదీన జరగనున్న సీతారాముల కల్యాణానికి పర్ణశాల పుణ్యక్షేత్రం ఎంతో సుందరంగా ముస్తాబవుతోంది. పర్ణశాలలో జరిగే రాములోరి కల్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్నిరకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి రంగులు, విద్యుత్ వెలుగులతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ పంచవటిలో ఉన్న సీతారాములు, లక్ష్మణ, రావణాసురుడు విగ్రహాలకు రంగులు వేశారు. సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా కల్యాణ మంటపం వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు నవమి ఫెస్టివల్ ఆఫీసర్ అనిల్ తెలిపారు. రాములవారి కల్యాణానికి ఉభయదాతలుగా రూ.1,500 చెల్లించి భార్యాభర్తలు కల్యాణంలో పాల్గొనవచ్చని, వారికి గోత్రనామాలతో అదేరోజు కల్యాణ మంటపంలో కల్యాణం జరిపి స్వామివారి ప్రసాదం, కండువా, జాకెట్ముక్క, పెద్ద లడ్డు, కల్యాణ అక్షింతలు అందజేస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 11 మంది దంపతులు రూ.1,500 చెల్లించి వారి పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, ప్రధానమార్గంలో గ్రీన్మ్యాట్లు, తాగునీటి సౌకర్యం, ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు, తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
భద్రాచలం ప్రాంతానికి చెందిన రామాయణ గాధ ఎంతో విశిష్టమైంది. భద్రాచల రాముడిని భోగా రాముడని, దుమ్ముగూడెం రాముడిని ఆత్మ రాముడని, పర్ణశాల రాముడిని శ్లోక రాముడిగా రామాయణంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే పర్ణశాల పుణ్యక్షేత్రంలో సీతారాముల వారు 14 ఏళ్లు అజ్ఞాతవాసం చేశారనే ఉద్దేశంతో భక్తులు ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారు. గోదావరి నదీ తీరాన పర్ణశాల వద్ద పంచవటి, నారచీరల ప్రాంతం పర్ణశాల చరిత్రకు సేజీవ సాక్షులుగా మిగిలాయి. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రం సీతారాముల కల్యాణానికి ఎంతో సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం రామయ్యను దర్శించుకున్న ప్రతి భక్తుడు పర్ణశాల రామయ్యను దర్శించుకొని పరవశించిపోతుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద ప్రత్యేక నిధులు మంజూరు చేసింది.
పర్ణశాలలో జరిగే సీతారాముల కల్యాణానికి దేవాదాయ శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఎంపీవో ముత్యాలరావు తెలిపారు. పారిశుధ్య పనులు, శానిటేషన్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. రాములోరి కల్యాణం చూడటానికి వచ్చే భక్తులకు తాగునీరు, వైద్య శిబిరాలు, దారి పొడవునా టెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.