ఒకప్పుడు సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు జంకేవారు. అక్కడ చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరని.. ఒకవేళ పంపించినా శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో పిల్లలు చదువుకోలేరని సందేహించేవారు. గత ప్రభుత్వాల హయాంలో ఇవన్నీ మనం కళ్లారా చూశాం. ఇక ప్రభుత్వ పాఠశాలలు బాగుపడవని ఒక దశలో నిర్ణయానికొచ్చాం. వాటన్నింటికీ చెక్ పెడుతూ సీఎం కేసీఆర్ సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది ‘మా పిల్లల్ని సర్కారు పాఠశాలలకే పంపుతాం..’ అని తల్లిదండ్రులు నిర్ణయించుకునే స్థితిని తీసుకొచ్చింది.. అంతేకాదు.. యాజమాన్యాలు బడి నిర్వహణ, స్టేషనరీ ఖర్చులకు ఇబ్బందిపడకుండా విద్యా సంవత్సరం ఆరంభంలోనే నిధులు విడుదల చేసింది.
– ఖమ్మం, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం వ్యవసాయం, జూలై 6 : ఉమ్మడి రాష్టంలో పల్లెల నుంచి మొదలుకొని పట్టణాలు, నగరాల వరకు ఎక్కడ చూసిన ప్రైవేటు కాన్వెం ట్లు కనిపించేవి. ఆరేండ్లలోపు వయస్సు ఉన్న పిల్లలను ఫీజులు కట్టి మరీ తల్లిదండ్రులు కాన్వెంట్లలోనే చేర్పించేవారు. నాటి అంగన్వాడీ కేంద్రాలు కేవలం అలంకారప్రాయంగా ఉండేవి. స్వరాష్టం వచ్చిన తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు ఊపిరి పోసింది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ఆరు నెలల నుంచి మూడేళ్ల వయస్సులోపు చిన్నారులు, 3-6 ఏళ్లలోపు పిల్లలకు బాలామృతంతో పాటు రోజు విడిచి రోజు గుడ్డు వంటి పౌష్టికాహారం అందిస్తున్నది.
ప్రతి సేవ ఆన్లైన్లో నమోదు..
గతంలో ఆంగన్వాడీ సేవలు మా న్యూవల్గా ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సేవను ఆన్లైన్ చేసింది. అందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు అందించింది. శిక్షకులతో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఉమ్మడి పాలనలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అంతంతమాత్రం వసతులు ఉండేవి. పిల్లలు రాసుకునేందుకు కనీసం పలకలు, పుస్తకాలు కూడా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు సొంతభవనాలు అందుబాటులోకి వచ్చాయి. టీచర్లు ఆంగ్లంలో పిల్లలకు ప్రీస్కూల్ విద్య బోధిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా బోధన పరికరాలు వినియోగిస్తున్నారు. ఆరేళ్లు దాటేలోపు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి సమానమైన విద్యనందించి అనంతరం వారిని 1వ తరగతికి సిఫార్సు చేస్తున్నారు.
వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ..
పిల్లల ఆరోగ్య సంరక్షణతో పాటు అంగన్వాడీ టీచర్లు చదువుపైనా దృష్టి సారిస్తున్నారు. అక్షరాలు రాయలేని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టి పిల్లలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తహీనత, పోషకాహార లోపంతోపాటు తక్కువ బరువు ఉన్న పిల్లలకు ప్రణాళిక ప్రకారం పోషకాహారం అందిస్తున్నారు. ప్రతి నెల వారిలో కలిగే మార్పులను నమోదు చేస్తున్నారు. ఆట పాటలతో విద్య బోధిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి వారి పురోగతిపై ప్రోగ్రస్ రిపోర్ట్ ఇస్తున్నారు.