పాల్వంచ, డిసెంబర్ 2 : తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రతి వీధిలోకి వచ్చే స్వచ్ఛ ఆటోలకు ప్రజలు అందజేయాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ కోరారు. పట్టణంలోని వెంగళరావుకాలనీలో స్వచ్ఛ సర్వేక్షన్-2023లో భాగంగా తడి, పొడి చెత్తపై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో రెండు రకాల చెత్తను తప్పనిసరిగా వేరు చేస్తేనే దాన్ని మళ్లీ ఉపయోగంలోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. చెత్తను డ్రైనేజీ, మోరీ, బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల దోమలు పెరిగి ప్రజలు రోగాలబారిన పడతారని అన్నారు. చెత్తను బయట పడవేసే వారికి రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శానిటేషన్ అధికారి లక్ష్మణ్రావు, ఏఈ రాజేశ్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ ఫరీద్ పాల్గొన్నారు.
ఫంక్షన్ హాల్స్లో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్(గ్లాసులు, డిస్పోజబుల్ ప్లేట్లు, టేబుల్ కవర్లు, ప్లాస్టిక్ స్పూన్లు, కప్పులు) వస్తువులను వాడవద్దని కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. పాల్వంచలోని పలు ఫంక్షన్ హాళ్లను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాస్టిక్ వస్తువులను వాడితే కలిగే అనర్థాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.