బోనకల్లు, మార్చి 29: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు పల్లె ప్రజల నుంచి విశేష ఆదరణ చూరగొన్నాయి. ప్రతి గ్రామంలోనూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రకృతివనాలను ఏర్పాటుచేసిన విషయం విదితమే. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా పల్లె ప్రకృతి వనాలకు వెళ్లి సేదదీరేవారు. ప్రకృతిని, ఆహ్లాదాన్ని ఆస్వాదించేవారు. కాలక్రమంలో రెండున్నరేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పల్లె ప్రకృతివనాలపై నిర్లక్ష్యం పెరిగింది.
ఆ తరువాత కొద్దినెలలకే పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోవడం, ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టడం, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ లభించకపోవడం వంటి కారణాలతో పల్లె ప్రకృతివనాలు ఆదరణకు నోచుకోలేకపోయాయి. కేసీఆర్ ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనాలు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిపై అక్కసు వెళ్లగక్కింది. కనీసం మొక్కలకు నీళ్లు కూడా పట్టలేదు. దీంతో అవన్నీ ఎండిపోయాయి. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బోనకల్లు పంచాయతీని బీఆర్ఎస్ పాలకవర్గం గెలుచుకుంది. కేసీఆర్తో కృషితో పురుడుపోసుకున్న ఈ పల్లె ప్రకృతివనానికి మళ్లీ పూర్వవైభవం తేవాలని సంకల్పించింది.
ఇందులో భాగంగా.. ఇప్పటి వరకూ వికృతంగా ఉన్న పల్లె ప్రకృతి వనానికి పునర్జీవం పోసింది. దీంతో ఇప్పుడదని మళ్లీ కళకళలాడుతోంది. గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. దీంతో ఈ పల్లె పార్కుకు వచ్చి సేదదీరుతున్న పల్లెవాసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ఈ పల్లె ప్రకృతివనాన్ని పూర్వవైభవం తెచ్చేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల కొరత ఉన్నా, పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా.. బోనకల్లు పంచాయతీలోని బీఆర్ఎస్ పాలకవర్గం మాత్రం ప్రత్యేక చొరవ తీసుకుంది. సర్పంచ్ బానోత్ జ్యోతి, ఉప సర్పంచ్, బీఆర్ఎస్ మండల నాయకుడు బానోత్ కొండా, పాలకవర్గ సభ్యులు కలిసి ఈ వనాన్ని మళ్ళీ సుందరంగా తీర్చిదిద్ది గ్రామస్తుల మన్ననలందుకుంటున్నారు.