దుమ్ముగూడెం, డిసెంబర్ 25 : ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతన్నలకు పశుగ్రాసం కష్టాలు తప్పడంలేదు. యంత్రాలతో వరికోతలు కోయించడంతో పంట మాత్రమే చేతికి వస్తున్నది.. వరిగడ్డికి మాత్రం నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక పోకడలతో పాడి రైతులకు పశుగ్రాసం కష్టాలు తలెత్తాయి. మారుతున్న కాలాన్ని బట్టి రైతులు సాగు విషయంలో సులభ పద్ధతులను అవలంబిస్తున్నారు. మండలంలో 20 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. రైతులు తమ పొలాల్లో వరికోతలు కోయించేందుకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. దీంతో వరిగడ్డి చేతికి రాకపోవడంతో పశుగ్రాసం విషయంలో ఇక్కట్లు తప్పడంలేదు. గతంలో కూలీలు చేతితో వరి కోసినప్పుడు వరిగడ్డి అందుబాటులో ఉండి.. పశువులకు పశుగ్రాసం కొరత లేకుండా ఉండేది. రైతుల ఆధునిక పద్ధతుల కారణంగా పంట దిగుబడులు ఎలా ఉన్నప్పటికీ పశువులను మేపుతున్న పాడి రైతులకు పశుగ్రాసం విషయంలో కష్టాలు ఎదురయ్యాయి. చేతికోత కోస్తే ఎకరానికి రూ.10 వేలు ఖర్చు వస్తున్నది.. యంత్రాలతో కోయిస్తే ఎకరానికి రూ.5 వేలతోనే పంటసైతం ఇంటికి చేరుతున్నది. వాతావరణ పరిస్థితులతోపాటు తక్కువ ఖర్చు వస్తుండడంతో రైతులు పంటను ఇంటికి చేర్చేందుకు యంత్ర విధానాన్ని అనుసరిస్తున్నారు.
వరిగడ్డి(పశుగ్రాసం) ట్రాక్టర్ ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలకడంతో రైతులు పాడి పశువులను పోషించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఖర్చయినా గ్రాసాన్ని కొనుగోలు చేయక తప్పడంలేదు. భద్రాచలం డివిజన్లో అన్నదాతలు వరిని ఎక్కువగా సాగు చేస్తున్నప్పటికీ వరికోత యంత్రాల కారణంగా పశుగ్రాసం రైతులకు అందడంలేదు. బయటి నుంచి కొనుగోలు చేసే పరిస్థితులు దాపరించాయి. కొందరు రైతులు యంత్రాలతో కోసిన గడ్డిని యంత్రాలతోనే కట్టలుగా కట్టిస్తున్నారు. యంత్రం ద్వారా కట్టలు కట్టిన కట్టకు రూ.30 చొప్పున యజమాని చెల్లిస్తున్నాడు. ఇలా చేయడం ద్వారా కొంతమేరకైనా పశుగ్రాసం కష్టాలు తొలుగుతాయని రైతులు భావిస్తున్నారు.