ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 21: భారత ప్రభుత్వ సహకార శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)ను కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ)గా మార్పులు చేయనున్నట్లు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తెలిపారు. నగరంలోని డీసీసీబీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన పీఏసీఎస్ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సొసైటీల్లో కొద్దిరోజుల్లోనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తద్వారా 300 రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
గ్రామీణ ప్రజలకు ఇక నుంచి ఆధార్, పాన్కార్డు, రైల్వేటికెట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు సమయం ఆదా కావడంతోపాటు ఆర్థిక బారం కూడా తగ్గుతుందని అన్నారు. డీసీవో విజయకుమారి, డీసీసీబీ సీఈవో అబ్దుల్ ఉర్ రెహమాన్, జీఎంలు నర్మద, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.