ఖమ్మం లీగల్, ఆగస్టు 13 : జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 7,749 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా ఖమ్మంలో ఆరు లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.డానీరూద్ 72 కేసులు, మోటరు వాహన ప్రమాద బీమా కేసులను పరిష్కరించి బాధితులకు రూ.2.20 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. సీనియర్ సివిల్ జడ్జి జి.శ్రీనివాస్ 11సివిల్ కేసులు పరిష్కరించారు. మొదటి అదనపు జూనియర్ జడ్జి ఎన్.శాంతిసోని అధ్యక్షతన జరిగిన లోక్ అదాలత్ బెంచిలో 880 సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యాయి.
మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పూజిత 2,067కేసులను పరిష్కరించి అవార్డులను జారీ చేశారు. మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఈ భారతి 791 కేసులను పరిష్కరించారు. న్యాయవాదులు వి.వేరేందర్, టి.వెంకటేశ్వర్లు, టి.వెంకటనారాయణ, జి.వీరన్న, కె.యాకూబ్, పి.రామబ్రహ్మం లోక్ అదాలత్ సభ్యులుగా వ్యవహరించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఖమ్మం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కక్షిదారులకు సాంబారు ఆహారాన్ని పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు, న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, లయన్స్ క్లబ్ సభ్యులు బత్తుల బసవ పున్నయ్య, సత్యనారాయణ తదితరులు ఆహారాన్ని కక్షిదారులకు పంపిణీ చేశారు.