ఖమ్మం, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉక్రెయిన్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. రష్యన్ ప్రభుత్వం ఇప్పటికే తన బలగాలను ఉక్రెయిన్కు పంపించి దాడులు చేయిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అక్కడ చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల యోగక్షేమాలపై వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నా రు. ఉక్రెయిన్లో అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన వైద్యకళాశాలలు ఉన్నాయి. మూడు, నాలుగేళ్లుగా అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న వారు ఇన్నాళ్లూ ప్రశాంతంగా చదువుతున్నారు. ఒక్కసారిగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో సర్వత్రా ఆందోళన మొదలైంది. ఖమ్మానికి చెందిన డాక్టర్ బాబూరావు కుమార్తె పూజ ఉక్రెయిన్లోని కర్క్యూనేషనల్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్నది. మూడు రోజులుగా ఆ మె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతకీ ఆందోళన తగ్గడంలేదని, కుమార్తెకు మంచినీళ్లు సైతం దొరకని పరిస్థితుల్లో ఉన్నందుకు చింతిస్తున్నట్లు ‘నమస్తే’కు తెలిపారు. తన కుమార్తె చదువుతున్న మెడికల్ కళాశాల సమీపంలో బాంబుల మోత మోగుతున్నాయని తెలుస్తుందన్నారు. ఆమె ఉంటున్న ప్రాంతంలో కనీసం విద్యుత్ సౌకర్యం లేదని, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం నగరానికి చెందిన విద్యుత్శాఖ అధికారి సూర్యనారాయణమూర్తి కుమార్తె ఇందిర ఉక్రెయిన్లోని ఓ వైద్య విద్యాసంస్థలో చదువుతున్నది. ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇండియన్ ఎంబసీ రంగంలోకి దిగి అక్కడ చదువుతున్న ఇండియన్ విద్యార్థుల సంక్షేమంపై ఆరా తీస్తుండడం, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నిస్తుండడంతో కొంత ఊరట లభించిందని విద్యార్థుల తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. ఎంబసీ ఇప్పటికే విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 12 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో చదువుతున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కొందరు విద్యార్థులు భారతదేశానికి వచ్చేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నా ఎయిర్పోర్టుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది