Aadhaar update | ఖమ్మం, మే 16: అన్నింటికీ ఆధార్ కార్డే ప్రత్యేక గుర్తింపు అయ్యింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు దీనితోనే ముడిపడి ఉంది. దేనికైనా ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సిమ్ కార్డు మొదలు బ్యాంకు ఖాతా, వాహనాలు, ఇళ్లు, భూములు, విద్య, వైద్యం పొందే సమయాల్లో, క్రయ, విక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందే వరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. కార్డు వచ్చిన తొలినాళ్లలో తీసుకున్న వారి కార్డుల వినియోగంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫొటోలు, చిరునామాల మార్పు, తప్పొప్పులతో తిరసరణకు గురవుతున్నాయి.
దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థకు ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఆధార్ కార్డుల సవరణతోపాటు అప్డేట్ చేసుకునేందుకు ప్రజలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2014 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్డు నవీకరణ చేసుకునేందుకు జూన్ 14వ తేదీ వరకు గడువు విధించింది. దీంతో ఆధార్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తగిన డాక్యుమెంట్లతో ప్రజలు క్యూ కడుతున్నారు.
పదేళ్లు దాటితే తప్పనిసరి..
చిన్నారులు ఆధార్ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన ఆధార్ కార్డును ఐదేళ్ల వయస్సు వచ్చిన తర్వాత వేలిముద్రలు, ఫొటోలను అప్డేట్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అలాగే పదేళ్ల క్రితం కార్డు పొందిన వారంతా ప్రస్తుతం అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత ఆధార్ కార్డుల్లో మార్పులకు సరారు అవకాశం కల్పించడంతో అప్డేట్ చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ప్రధానంగా 2010-18 వరకు ఆధార్ నమోదు చేసుకున్న కార్డుదా రులు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లికి ముందు కార్డులో తండ్రి పేరున్న యువతులు వివాహం తర్వాత భర్త పేరు మార్చుకునేందుకు గతంలో అవకాశం ఉండకపోయేది. దీనికి ఆయా స్థానాల్లో కేరాఫ్ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వాటిని సైతం మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. 70 ఏళ్లు దాటిన వారికి మినహాయింపు ఇచ్చారు.
ఆన్లైన్లోనూ అవకాశం
ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే క్రమంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా.. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆన్లైన్లో స్వతహాగా అప్డేట్ చేసుకునే వెసులుబాటును యూఐడీఏఐ కల్పించింది. మై ఆధార్ పోర్టల్, ఎం ఆధార్ యాప్ ద్వారా myaadhaar.uidai.gov. in పై క్లిక్ చేసి ఫోన్ నెంబర్ నమోదు చేసిన తర్వాత వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు డాక్యుమెంట్ అప్డేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ ధ్రువపత్రాలు, చిరునామా నిరూపించే పత్రాన్ని అప్లోడ్ చేసి సమర్పించాలి.
వెంటనే ఆధార్ అప్డేట్ పూర్తయినట్లు ఫోన్ నంబర్కు మెసేజ్ వస్తుంది. ఆధార్ నమోదు కేంద్రాలు, మీ సేవ కేంద్రాల్లో ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు చెల్లించాల్సిన రుసుముపై ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ.100, డెమోగ్రాఫిక్ అప్డేట్కు రూ.50, ఆధార్ డౌన్లోడ్, కలర్ ప్రింట్ కోసం రూ.30 చొప్పున చెల్లించాలి. ఇంతకు మించి డబ్బులు వసూలు చేస్తే సంబంధిత ఆధార్ సెంటర్ కోడ్ నంబర్తో టోల్ఫ్రీ నంబర్ 1947కు ఫిర్యాదు చేయొచ్చు.