భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రంగురంగులతో తళుక్కున మెరుస్తున్న గోడలు.. శుభ్రమైన టాయిలెట్లు.. స్వచ్ఛమైన తాగునీరు, ఆకర్షణీయమైన బల్లాలు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, డిజిటల్ స్మార్ట్క్లాస్ రూం పరికరాలు, గ్రీన్ చాక్పిస్ బోర్డులు, కంప్యూటర్లు, సైన్స్ల్యాబ్లు, పచ్చని మొక్కల మధ్య ఆవరణలతో సర్కార్ బడులు సరికొత్తగా దర్శనమిస్తున్నాయి. ‘మన ఊరు/బస్తీ-మన బడి’ నిధులు రూ.91.64 కోట్లతో పాఠశాలల్లో కొత్త నిర్మాణాలు చేపట్టడంతో సౌకర్యాల్లో ‘కార్పొరేట్’ను మించిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 పాఠశాలలను ఎంపిక చేసి తొలి విడతలో సరికొత్తగా రూపుదిద్దారు. 33 పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తికాగా.. 45 స్కూళ్లల్లో 80శాతం పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్స్తోపాటు మధ్యాహ్న భోజనం పెడుతుండడంతో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కనీస సౌకర్యాలు ఉండేవికావు.. చదువులు సైతం అంతంతమాత్రమే. తెలంగాణ వచ్చాక సర్కార్ బడుల రూపురేఖలే మారిపోయాయి. విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పించడమే కాకుండా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన కొనసాగిస్తుండడంతో ఆదరణ బాగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలకు ‘మన ఊరు/బస్తీ – మన బడి’ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నది. దీంతో కొత్త కొత్త నిర్మాణాలు పూర్తయ్యి సర్కారు బడులు కార్పొరేట్ స్కూళ్లను మించిపోతున్నాయి. కాన్వెంట్ స్థాయి తరగతి గదులు, తళుక్కున మెరిసే రంగురంగుల తరగతి గోడలు, పచ్చని మొక్కల నడుమ పాఠశాల ఆవరణలు, పరిశుభ్రంగా ఉన్న టాయిలెట్స్తో కొత్త కళను సంతరించుకున్నాయి. ఒకటికాదు రెండుకాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 పాఠశాలలను ఎంపిక చేసి తొలివిడతలో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 33 పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తికావడంతో వాటిని ప్రారంభించారు. మరో 45 పాఠశాలలు 80శాతం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగతా స్కూళ్లలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మేదరబస్తీ పాఠశాల..
కొత్తగూడెం నియోజకవర్గంలోని మేదరబస్తీ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. నీళ్లు కూడా లేని దుస్థితి. ఇప్పుడు పిల్లలకు తాగునీటి సౌకర్యంతోపాటు టాయిలెట్స్ నిర్మించి, సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. పాత కొత్తగూడెం ఇంగ్లిష్ మీడియం స్కూ ల్ను చూస్తే కార్పొరేట్ స్కూల్ను తలపిస్తున్నది. ప్రతి తరగతి గది కార్పొరేట్ను మించిపోయింది. క్రీడామైదానం విశాలమైన ఆవరణ మన ఊరు- మన బడి నిధులతో రూపురేఖలు మారిపోయాయి. ఇలాంటివి ఒకటికాదు రెండుకాదు ఏకంగా జిల్లాలో 368 పాఠశాలలకు నిధులు మంజూరు చేయడంతో సర్కారు స్కూళ్లు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
బడిపిల్లలకు భరోసా..
సర్కారు ఒడిలో మన ఊరు- మన బడి వచ్చి చేరింది. దీంతో బడిపిల్లలకు భరోసా కలిగింది. పేదల చదువుకు భరోసానిచ్చేలా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త అందాలు తెచ్చిపెట్టింది. మన ఊరు- మన బడి కార్యక్రమం సర్కారు స్కూళ్ల ముఖచిత్రాన్నే మార్చివేస్తున్నది. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా విద్యాభోదన జరగడంతోపాటు, తరగతి గదులు, ఇతర సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. జిల్లావ్యాప్తంగా 368 పాఠశాలలను ఎంపిక చేసుకుని వాటికి అవసరమైన పనులను గుర్తించారు.
రూ.91.64 కోట్లతో సకల సౌకర్యాలు
నిధుల కొరత లేకుండా కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేస్తున్నారు. వీసీ, టీసీ ద్వారా అధికారులను అప్రమత్తం చేసి మన ఊరు- మన బడి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలను ప్రత పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 1,064 పాఠశాలలు ఉండగా అందులో మొదటి విడతలో 368పాఠశాలలు పూర్తికాబోతున్నాయి. మిగతా బడులకు రెండో దశలో పనులు జరుగనున్నాయి.
ప్రతి స్కూల్లో టాయిలెట్స్, డైనింగ్ హాల్స్
టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ నిర్మాణాలను ఉపాధిహామీ పథకం నిధులతో చేపట్టనుండగా నామినేషన్ పద్ధతిలో పనులు చేపట్టి పనులు వేగవంతం చేస్తున్నారు. ప్రతి బడిలో బల్లాలు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, డిజిటల్ స్మార్ట్క్లాస్ రూం పరికరాలు, పేయింట్స్, గ్రీన్ చాక్పిస్ బోర్డులు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ల ఫర్నిచర్ను టెండర్ల ద్వారా కొనుగోలు చేసి ఇప్పటికే అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అధికారులు అంచనాలు తయారు చేసి కార్యరూపం దాల్చారు. దీంతోపాటు పచ్చని మొక్కలను వేసి ఆవరణలకు ప్రకృతి నిలయాలుగా మార్చారు. తాగునీటి సౌకర్యాన్ని మరింత మెరుగుపరచి నీరు వృథా కాకుండా చర్యలు తీసుకున్నారు.
కార్పొరేట్ను తలదన్నే టేకులపల్లి స్కూల్..
ఇల్లెందు నియోజకవర్గం టేకులపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గతంలో చూస్తే ఇది బడేనా అనిపించేది. పాడుబడిన బంగ్లాలో చదువులు చెప్పలేక టీచర్లు ఇబ్బందులు పడేవాళ్లు. తెలంగాణ సర్కారు పుణ్యమా అని మన ఊరు- మన బడి నిధులు రావడంతో పాఠశాలకు మహర్దశ పట్టింది. ఇప్పుడు ఆ పాఠశాల కాన్వెంట్ను తలపిస్తున్నది. యూనిఫాం, పుస్తకాలు, నోట్బుక్స్తోపాటు మధ్యాహ్న భోజనం పెడుతుండడంతో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రధానోపాధ్యాయుడు దివ్యాంగుడు అయినప్పటికీ పిల్లలపై చూపించే ప్రేమతో విద్యార్థులు అక్కడ చదవాలని తాపత్రయపడుతున్నారు. ఎన్నో సమస్యలు నిత్యం వెంటాడినా.. ఇప్పుడు అన్ని సమస్యల నుంచి ఆ పాఠశాల గట్టెక్కింది. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో చాలా ఉన్నాయి.
ఇంత మార్పు ఊహించలేదు..
సర్కారు బడులంటే సౌకర్యాలు ఉండవని చాలామంది అంటుంటారు. కానీ మా బడిని చూస్తే ప్రైవేట్ బడేమో అనుకుంటారు. ఇప్పుడు ప్రైవేటుకు తగ్గించారు. అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. మా టేకులపల్లి స్కూల్ చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగిపోద్ది. అన్ని సౌకర్యాలు సమకూరాయి. మా బాబు కూడా ఈ స్కూల్లోనే చదువుకుంటున్నాడు.
– బానోత్ లక్ష్మా, హెచ్ఎం, టేకులపల్లి స్కూల్
డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాం..
మన ఊరు- మన బడి కార్యక్రమంలో జిల్లాలో 64 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాం. క్లిక్ చేస్తే అనుకున్న పాఠం వచ్చేస్తుంది. పిల్లలకు సులువుగా అర్థమయ్యేందుకు డిజిటల్ తరగతులను అందుబాటులోకి తెచ్చాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గతంలో ప్రవేటులో చదివిన వాళ్లు ఇప్పుడు మన దగ్గర చదువుతున్నారు. టీచర్ల, ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతున్నారు.
– సోమశేఖరశర్మ, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం