భద్రాచలం, డిసెంబర్ 27: ‘వామనావతారా పాహిమాం.. పాహిమాం..’ అంటూ భక్తులు పులకించిపోయారు. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. భక్తులు తమ ఆరాధ్యదైవాన్ని వివిధ అవతారాల్లో దర్శించుకుంటూ పరవశించిపోతున్నారు. ఐదో రోజైన మంగళవారం భద్రగిరీశుడు వామనావతారంలో దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు శ్రీవారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు. సేవాకాలం, నిత్య హోమాలు, నిత్య బలిహరణం, నిత్య పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆండాళ్ తల్లిని, శ్రీకృష్ణ పరమాత్మను, స్వామివారి ఉత్సవ మూర్తులను బేడా మండపంలో ఉంచి 30 ద్రవిడ పాశురాలను విన్నవించారు.
అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు వామనావతారం అలంకరించి భక్తుల దర్శనార్థం బేడా మండపంలో ఉంచారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ప్రత్యేక వేదికపై స్వామివారిని ఉంచగా.. మిథిలా స్టేడియంలో ఉన్న భక్తులు తమ ఆరాధ్య రాముడిని దర్శించుకొని తన్మయత్వం చెందారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారిని విశ్రాంత మండపానికి తీసుకొని వెళ్లారు. అక్కడ నుంచి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు.
నేడు పరశురామావతారం
శ్రీమన్నారాయణుడు జమదగ్ని అనే మహర్షికి కుమారుడిగా జన్మించి, పరశురాముడిగా పిలువబడుతుండేవాడు. దుష్టుడైన కార్తవీర్యార్జునుని, దుర్మార్గులైన రాజులను ఇరవై ఒక్క సార్లు దండెత్తి సంహరించాడు. ధర్మాన్ని స్థాపించాడు. బుధవారం భద్రాద్రి రామయ్య పరశురాముడి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
పర్ణశాలలో..
దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలోనూ ముక్కోటి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంళవారం పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారం గురించి అర్చకులు భక్తులకు వివరిస్తూ దేవతల సర్వసంపదలను తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి శ్రీహరి వామన రూపంలో వెళ్లి మూడు అడుగుల భూమిని దానంగా స్వీకరించారు. అక్కడి నుంచి మూడు లోకాలను కొలిచి బలి చక్రవర్తి అహాన్ని అణిచి అనుగ్రహించాడు.