నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 9 ; ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవాలయాల్లో శివపార్వతుల కల్యాణం శుక్రవారం అర్ధరాత్రి కన్నుల పండువగా జరిగింది. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా.. వేద పండితుల మంతోచ్ఛారణల మధ్య నిర్వహించిన స్వామివారి కల్యాణాన్ని వేలాది మంది భక్తులు తిలకించి తన్మయత్వం పొందారు. జాగారంతో నిత్యం శివనామ స్మరణ చేస్తూ కల్యాణ తంతును కనులారా వీక్షించారు. కూసుమంచి శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు ఉమాసోమలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని వైభవోపేతంగా జరిపించారు. రూరల్ మండలం తీర్థాల శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని కన్నుల పండువగా చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎంజీరోడ్లో ఉన్న విజయవిఘ్నేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయంలో కల్యాణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. అన్నపురెడ్డిపల్లిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో త్రిశూల స్నానం కార్యక్రమాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్ష్మి దంపతులు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలోని రామలింగేశ్వరస్వామి, సత్తుపల్లిలోని నీలాద్రీశ్వరుడిని, ఖమ్మం కాల్వొడ్డులోని గుంటుమల్లేశ్వరస్వామి, రూరల్ మండలం తీర్థాల, కూసుమంచి శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కూసుమంచి శివాలయంలో హైదరాబాద్, ఖమ్మం కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. టేకులపల్లి మండలం కొండంగబోడు కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కూసుమంచి, తీర్థాల శివాలయాలను దర్శించుకొని శనివారం ప్రత్యేక పూజలు చేశారు.
–